టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఈ మద్య తమిళ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటుతున్నాడు మహేష్ బాబు. గత రెండు సంవత్సరాల నుంచి రెండు భారీ డిజాస్టర్ చవిచూసిన మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ మద్య మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మహేష్ కుటుంబం నుండి మరో హీరో సినిమాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అతడు మరెవరో కాదు.. గల్లా జయదేవ్ తనయుడు అశోక్. త్వరలోనే అశోక్ హీరోగా పరిచయం కాబోతున్నాడని సమాచారం. గుంటూరు ఎంపీగా రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తి గల్లా జయదేవ్. సినిమా రంగానికి సంబంధించిన వివిధ కోర్సుల్లో అశోక్ గల్లా అమెరికాలో శిక్షణ తీసుకున్నాడని అన్నారు. అశోక్ నటించే మొదటి సినిమాను దిల్ రాజు నిర్మిస్తారని అంటున్నారు.