తెలుగు రాష్ట్రాల ప్రజలకు నిజానికి రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ కంటే ముందే.. మరో ‘ఆర్ఆర్ఆర్’ ఉన్నారు. ఆయనే ‘రఘు రామ కృష్ణం రాజు’. ఈ పేరే ఓ సంచలనం. నిత్యం జగన్ రెడ్డి పై, జగన్ రెడ్డి ప్రభుత్వం పై నిప్పులు కురిపిస్తూ ఆయన వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. రఘు రామ కృష్ణం రాజు వ్యక్తిత్వం బహు విచిత్రం. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి రాజకీయ నాయకుడిగా రఘు రామ కృష్ణం రాజు గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో ఆయన పై ఉన్న అభిప్రాయం ఏమిటి ?, ఇంతకీ వచ్చే ఎన్నికల్లో రఘు రామ కృష్ణం రాజు పరిస్థితేంటి ?, అలాగే ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి.
పారిశ్రామిక వర్గాల్లో రఘుగా సుపరిచితుడైన ‘కనుమూరి రఘు రామ కృష్ణంరాజు’ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో (అమ్మమ్మ గారింట్లో) సంపన్న పారిశ్రామిక వేత్తల కుటుంబంలో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఫార్మసీలో ఆయన ఎంఎస్సీ పూర్తి చేశారు. రఘు రాజకీయాల్లో రాకముందు వ్యాపార రంగంలో ఉన్నారు. ఇండ్ – భారత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ గా ఆయన వ్యవహరించారు. రఘు కుటుంబం తొలి నుంచి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. రఘు తాత గారు (తల్లి గారి తండ్రి) సిరీస్ రాజు కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలలో ఒకరు. రఘు పెదనాన్న కనుమూరి బాపిరాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మరియు ఎంపీగా కూడా సేవలందించారు.
వియ్యంకుడు కేవీపీ రామచంద్రరావు సైతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. అలాగే, బీజేపీ నేత మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సైతం రఘు రామ కృష్ణం రాజుకు బంధువు. రఘు తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడిగా ఉంటూ వచ్చారు. వైఎస్ కుటుంబంపై ఉన్న అభిమానంతో 2011లో వైసీపీ పార్టీలో చేరి కొంత కాలం పాటు క్రియాశీలకంగా వ్యవహరించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ పార్టీకి రాజీనామా చేసి 2014 లో బీజేపీలో చేరారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించేందుకు ఆ పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, 2019 లోక్ సభ ఎన్నికల్లో నరసాపురం ఎంపీ టికెట్ దక్కకపోవడంతో ఆఖరి నిమిషంలో వైసీపీ అధినేత జగన్ నుంచి పిలుపుతో పాటు నరసాపురం టికెట్ హామీతో ఆ పార్టీలో చేరి నరసాపురం ఎంపీ గా విజయం సాధించారు.
ఎంపీగా ఉన్నప్పటికీ వైసీపీ పార్టీలో వ్యక్తిగత స్వేచ్ఛ, సమానత్వం లేకపోవడం అనే కారణం చేత ఆ పార్టీలో ఉంటూనే అధినేత జగన్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దాంతో, జగన్ రెడ్డి హయాంలో రఘు రామ కృష్ణం రాజు పోలీసులు దెబ్బలు కూడా తినాల్సి వచ్చింది. తనను కొడుతుంటే జగన్ రెడ్డి రాక్షస ఆనందం పొందారు అని రఘు రామ కృష్ణం రాజు గారే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎప్పటికైనా జగన్ రెడ్డికి దెబ్బలు రుచి చూపించాలని రఘు రామ కృష్ణం రాజు పట్టుదలగా ఉన్నారు. ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నా.. ఆయన కొంతకాలంగా టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారు. ఇక ఆయన గ్రాఫ్ విషయానికి వస్తే.. ఆయన పై ప్రజల్లో సానుభూతి ఉంది. అలాగే వచ్చే ఎన్నికల్లో రఘు రామ కృష్ణం రాజు టీడీపీ తరఫున పోటీ చేస్తే కచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఏది ఏమైనా జగన్ అసమర్థ పరిపాలన పై తీవ్రమైన విమర్శలు సంధిస్తున్న వ్యక్తిగా రఘు రామ కృష్ణం రాజు గారు క్రెడిట్ కొట్టేశారు.