తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క రిటర్న్గిఫ్ట్ ఇస్తే తిరిగి మూడు గిఫ్ట్లు ఇస్తాం తప్ప వదిలే ప్రసక్తే లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సీబీఐని జగన్ మెడ మీద పెట్టి ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. కోడి కత్తి కేసును ఎన్ఐఏకి ఇవ్వడం ద్వారా తమకు లేని అధికారాన్ని కేంద్రం తీసుకుందని సీఎం మండిపడ్డారు. శుక్రవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తారకరామసాగర్, వావిలాల ఘాట్ ప్రారంభించిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన పార్టీ టీడీపీ. రాష్ట్రాన్ని ఎవరు దెబ్బతీయాలని ప్రయత్నించినా.. రాష్ట్ర హక్కులను ఎవరు అపహరించినా రాజీలేని పోరాటం చేస్తాం. అదీ మా నాయకుడు ఎన్టీఆర్ ఇచ్చిన స్ఫూర్తి. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారట. మేమేమైనా చేతగానివాళ్లమా? మేం మూడు గిఫ్ట్లు తిరిగి ఇస్తాం తప్ప వదిలి ప్రసక్తే లేదు. కేసీఆర్, జగన్ కలిసినా ఏమీ చేయలేరు. దృఢ సంకల్పంతో ముందుకెళ్తాం తప్ప వెనకడుగేయం. కులాల పేరిట ప్రజల్లో చిచ్చుపెట్టాలనుకునే నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ ఆసరా లేక కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
దేశ ప్రజలను అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేసిన బీజేపీకి గుణపాఠం తప్పదన్నారు. కోల్కతాలో రేపు మమతతో సమావేశమవుతున్నట్టు సీఎం ప్రకటించారు. దేశంలోని ప్రతిపక్షాలు హాజరువుతున్న ఈ భేటీలో చర్చించి అందరి సహకారంతో దేశాన్ని బీజేపీ నుంచి కాపాడుకుంటామన్నారు. బీజేపీ పాలనలో దేశంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు.