ఈ ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేశామని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే నాణ్యమైన భోజనాన్ని పేదలకు అందిస్తున్నామని చెప్పారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్షోలో చంద్రబాబు మాట్లాడారు. అన్ని గ్రామాలనూ స్మార్ట్ గ్రామాలుగా మారుస్తున్నామన్నారు. హుద్హుద్ తుపాను తర్వాత ఎంతో కష్టపడ్డాని.. విశాఖ నగరం కోలుకునే వరకు ఇక్కడే ఉండి పనిచేశామని చంద్రబాబు గుర్తు చేశారు.
‘విశాఖలో మెడ్టెక్ జోన్ వస్తోంది. దీంతో 20వేల ఉద్యోగాలు వస్తాయి. సబ్బవరంను విద్యాకేంద్రంగా తయారు చేస్తాం. ఉద్యోగులు కోరినట్లు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచాం. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాం.. భవిష్యత్తులో మరింత చేస్తాం. మనపై అందరూ గద్దల్లా వాలుతున్నారు. కేసీఆర్, జగన్ కలిసి నాటకాలు ఆడుతున్నారు. దేశంలో విశ్వసనీయత మనకే ఉంది. కేసీఆర్ మాటకారే తప్ప.. చేష్టల్లో ఏమీ లేదు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ అందరి దగ్గరికీ తిరిగి చివరికి దాన్ని మోడీ ఫ్రంట్గా మార్చేశారు’
‘వైఎస్ వివేకా హత్య వాళ్ల ఇంట్లోనే జరిగింది.. అయినా నాటకాలు ఆడారు. కారు డ్రైవర్ చంపినట్లు ఓ లేఖ సృష్టించారు. డ్రైవర్పై నెపం వేసి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. మృతదేహాలకు సైతం కట్లు కట్టేవారిని ఏమనాలి? ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను ఉన్నంతకాలం రౌడీరాజ్యం రానివ్వను. జగన్పై ఉన్న కేసుల గురించి విశాఖ లోక్సభ జనసేన అభ్యర్థి మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పాలి. భర్త ఒక పార్టీ.. భార్య మరో పార్టీ.. ఎవరిని మోసం చేస్తారు? వైసీపీ ఫ్యాన్.. మోడీ, కేసీఆర్ చేతుల్లో ఉంది. ఫారం-7 దరఖాస్తు దొంగలను వదిలిపెట్టేది లేదు. ఏపీలో తిరిగేందుకు ఫ్యాన్కు అర్హత లేదు. కేసీఆర్ పెత్తనం ఆంధ్రాకు అవసరమా?’ అని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.