కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లోని కోస్గిలో టీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను చూస్తుంటే టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డి గెలిచినట్టే అని తనకు అర్థమైందని కేసీఆర్ అన్నారు. పాలమూరుకు శ్రతువులు బయట ఎక్కడో లేరని, పాలమూరు జిల్లాలోనే ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు. తమ అభ్యర్థిని గెలిపిస్తే కొడంగల్ను అభివృద్ధి చేసే పూచీ తనదంటూ భరోసా ఇచ్చారు. కోస్గి సభలో సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేరును కనీసం ప్రస్తావించకుండానే కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించడం గమనార్హం.
’58 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో తెలంగాణలో ఏ విధమైన సంక్షేమం ఉంది? ఆనాడు పెన్షన్ ఎంత? ఆరోజు వారు పంపిణీ చేసిన బియ్యం ఎన్ని? ఇప్పుడెలా ఇస్తున్నామో ప్రజలకు తెలుసు. గతంలో గర్భిణుల ప్రసవానికి వెళ్తే పైసలు ఖర్చయ్యేవి. నేడు ప్రభుత్వమే గర్భిణులకు తిరిగి డబ్బులు ఇచ్చి ప్రసవాలు చేయించి బిడ్డలతో పాటు అమ్మ ఒడి వాహనంలో వారిని ఇంటికి చేరుస్తోంది. మిషన్ భగీరథతో ఇంటింటికీ నీళ్లు ఇస్తున్నాం. వాస్తవాలను గమనించి ఈసారి టీఆర్ఎస్ను దీవిస్తే ఆసరా పింఛన్లను రెట్టింపు చేస్తాం. నిరుద్యోగ యువకులకు రాష్ట్రవ్యాప్తంగా నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం. 24గంటల పాటు విద్యుత్ ఇస్తున్నాం. రైతులకు రైతుబంధుతో పాటు రైతు బీమా కల్పిస్తున్నాం. ప్రపంచమంతా రైతుబంధును చూసి ఆశ్చర్యపోతోంది. పేదలు, దళితులు, మైనార్టీల గురించి మేం పట్టించుకున్నాం. మైనార్టీలకు రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించాం. పండగలు వస్తే అందరినీ గౌరవిస్తున్నాం. ఇక ముందు అలాగే ముందుకెళ్తాం. కులం, మతం, జాతి వివక్షలేకుండా అందరి గురించి కార్యక్రమాలు చేపడతాం.’
‘పాలమూరుకు శత్రువులు బయట లేరు. ఈ జిల్లాలోనే ఉన్నారు. ఎంతమందితో కేసీఆర్ కొట్లాడాలి? పాలమూరు కరవు జిల్లా. కొండలు, బండలు రాళ్లు.. ఈ ప్రాంతానికి నీళ్లు తేవాలని పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును మొదలుపెట్టాం. రూ.35వేల కోట్లు మంజూరు చేశాం. అది పూర్తయితే 20లక్షల ఎకరాలకు నీరు అంది ఆకుపచ్చ పాలమూరుగా మారుతుంది. ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకుంటున్నారు. అలాంటి చంద్రబాబును కాంగ్రెస్ నెత్తిపై పెట్టుకొని తెలంగాణలోకి తెస్తోంది. పాలమూరు దరిద్రం పోవాలంటే అడ్డుపడేవాళ్లకు బుద్ధి చెప్పాలి. 14 ఏళ్లు మడమ తిప్పకుండా నిలబడి పోరాడితే.. చావు నోట్లో తలకాయి పెడితే తెలంగాణ వచ్చింది. ఆ వచ్చిన తెలంగాణను మళ్లీ ఆంధ్రాకు అప్పగిస్తారట. ప్రజాకూటమి గెలిస్తే పాలమూరు ప్రాజెక్టు నీళ్లు ఆపేస్తారు. కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించండి. కొడంగల్ లాంటి నియోజకవర్గాలు ఎక్కువలేవు. ఐదారు మాత్రమే ఉన్నాయి. టీఆర్ఎస్ను గెలిపిస్తే ఇక్కడకి నేనే స్వయంగా వచ్చి సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకుంటా. సాగునీరు, విద్యా సంస్థలు తీసుకొస్తాం. సొంత ఆర్థికవనరులు కల్గిన రాష్ట్రం తెలంగాణ. సంపదకు కొదవలేదు. కొడంగల్ను అభివృద్ధి చేసే బాధ్యత నాది. నర్సింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు నెలలోపు ఏర్పాటు చేస్తాం’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు.