దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించాలని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలం కోసం శుక్రవారం పార్టీ ఎంపీలు ఢిల్లీలోని కొన్ని ప్రభుత్వ స్థలాలను పరిశీలించనున్నారు. ఎంపీలతో పాటు ప్రముఖ వాస్తు నిపుణుడు సుధాకర్ తేజ కూడా స్థలాల పరిశీలనలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి సైతం ఈ రోజు ఆయా స్థలాలను స్వయంగా పరిశీలించి, అనువైన స్థలం ఎంపిక చేసే అవకాశం ఉంది.
నిబంధనల ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం నిర్మించుకోవడానికి వెయ్యి గజాల ప్రభుత్వ స్థలం కేటాయించే అవకాశం ఉంది. ప్రభుత్వం కేటాయించే స్థలంలో టీఆర్ఎస్ కార్యాలయం నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు. సంక్రాంతి పండుగ తర్వాత ఢిల్లీలో కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని.. రెండు, మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.