ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఎంతో టైం లేదు. పట్టుమని పదిరోజుల్లోనే పోలింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. ఉత్కంఠ ఊపేస్తున్న ఏపీ పాలిటిక్స్ పై కోట్లలో పందాలు కాస్తున్నారు. ఒకటికి పదింతలు చొప్పున ఏపీలోని ఉద్దండులు పోటీపడుతున్న నియోజకవర్గాలపై జోరుగా పందాలు కాస్తున్నారు. కానీ తాజాగా ఈ బాగోతం బయటపడింది..
సోమవారం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్ లో తనిఖీల సందర్భంగా కొందరు అనుమానితులను పోలీసులు గుర్తించారు. వారివద్ద విలువైన లాప్ టాప్ లు, నలభై లక్షలకు పైగా నగదుతో పాటు పలు క్రెడిట్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని పత్రాలు, పుస్తకాలు, డైరీల్లో ఎన్నికల బెట్టింగ్ కు సంబంధించిన సమాచారం ఉన్నట్టు పోలీసులు కనుగొన్నారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిల్లో నమ్మలేని నిజాలు, విషయాలు వెలుగుచూసినట్టు సమాచారం. ఏపీ నలుమూలల నుంచీ ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్టు ప్రాధమిక విచారణలో వెల్లడైంది. ఆంధ్రాలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా, హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి కూడా కోట్లల్లో బెట్టింగ్ లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో ఎన్నికలు అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో పోలీసులు పందేల రాయళ్లను వల వేసి పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న డైరీల్లో బెట్టింగ్ లకు సబంధించిన పలువివరాలు బైటపడ్డట్టు సమాచారం. బెట్టింగ్ గ్యాంగ్ దగ్గర దొరికిన పాకెట్ డైరీల్లో ఏపీ హాట్ సీట్స్ పేరుతో 30 నుంచి 40 నియోజకవర్గాల పేర్లు ఉన్నట్టుగా సమాచారం.. వీటిలో టాప్ లిస్టుగా కడప, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాలున్నట్టు తెలుస్తోంది.
కాగా ఈ బెట్టింగ్ లో పందెం రాయుళ్లు టీడీపీ ఓటమిపై ఎక్కువ శాతం బెట్టింగ్ కాసినట్టు సమాచారం. పోలీసుల అదుపులో ఉన్న బుకీలను విచారించగా ఈ విషయం వెలుగుచూసింది.. ఒకటికి పదింతల వరకూ ప్రముఖులు పోటీ చేస్తున్న సీట్లపై పందాలు సాగిస్తున్నారని సమాచారం. ఐపీఎల్ పందాలను మించి సాగుతున్న ఈ పొలిటికల్ బెట్టింగ్ లను చూసి పోలీసులే అవాక్కయ్యారట..