హైదరాబాద్, జనవరి 22: ప్రజా అవసరాలకు తగిన విధంగా ప్రాజెక్ట్లు చేపట్టాలి. ముఖ్యంగా ప్రాథమిక అవసరా లు తీర్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ప్రభుత్వాలు సంక్షేమం, ఉపాధి రంగాలకు ప్రాధాన్యత ఇస్తుండడంతో ప్రాజెక్ట్లు నిర్మించేందుకు అవసరమైన నిధులు సమకూర్చలేని పరిస్థితులు నెలకొంటోంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే ప్రజలపై పన్ను భారం మోపాలి. ఇది ఎవరికి ఇష్టం లేని వ్యవహారం. అందుకే ప్రత్యామ్నాయంగా యాన్యుటీ విధానం అమలులోకి వచ్చింది. తాగునీట ప్రాజెక్ట్ల నిర్మాణానికి అవసరమైన నిధులను ఎంఈఐఎల్ సమకూర్చి పనులు పూర్తి చేస్తే ఆ నిధులను ప్రభుత్వం దశలవారిగా సంస్థకు చెల్లిస్తుంది. దేశంలో తొలిసారిగా తాగు నీటి ప్రాజెక్ట్లను యాన్యుటీ విధానంలో మేఘా ఇంజనీరింగ్ ముందుకు వచ్చి చేపట్టింది. ఈ పద్ధతిలో ఎంఈఐఎల్ రూ. 6000 కోట్ల సొంత నిధులను వెచ్చించి దేశంలోని ఐదు ప్రధాన ప్రాజెక్టులను చేపట్టింది. మౌళిక సదుపాయాల కల్పనలో యాన్యుటీ విధానం విఫలమైందనే భావనతో ఏ సంస్థ కూడా ముందుకురాని తరుణంలో మేఘా ఇంజనీరింగ్ ధైర్యంగా ముందడుగు వేసి ఈ పద్ధతిలో ప్రాజెక్ట్ను నిర్మిస్తోంది. యాన్యుటీ విధానం కింద తెలంగాణలోని కేశవపూర్ రిజర్వాయర్ (హైదరాబాద్), హైదరాబాద్ నగర శివారులోని ఓఆర్ఆర్ పరిసర 190 గ్రామాలకు, 5 నగర పంచాయతీలకు తాగునీరు, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని 2426 పాఠశాలల నిర్మాణం, ఓడిషా రాజధాని భువనేశ్వర్ బల్క్ తాగునీటి ప్రాజెక్ట్లను ఎంఈఐఎల్ యాన్యుటీ మోడల్ క్రింద చేపట్టింది.
భువనేశ్వర్ బల్క్ వాటర్…
ఒడిషా రాజధాని నగరం భువనేశ్వర్ చుట్టుపక్కల పురపాలక సంఘాలతో పాటు ప్రముఖ విద్యా సంస్థలకు నీటిని అందించే భువనేశ్వర్ బల్క్ వాటర్ సరఫరా పథకం మేఘా ఇంజనీరింగ్ చేపట్టింది. ఈ పథకాన్ని రూ. 187 కోట్లు ఖర్చు చేసి 2017లో మేఘా ఇంజనీరింగ్ విజయవంతంగా పూర్తి చేసింది. భువనేశ్వర్ బల్క్ వాటర్ ప్రాజెక్టును 25 ఏళ్ల పాటు మేఘా ఇంజనీరింగ్ నిర్వహించనుంది. ఈ పథకం ద్వారా ఎంఈఐఎల్ ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐటీ భువనేశ్వర్, ఎన్ఐఎస్ఈఆర్, పారిశ్రామిక పార్కుతో పాటు భువనేశ్వర్ పరిసర మున్సిపాలిటీలైన ఖోర్దా, జాట్నాకు తాగునీరు అందిస్తుంది.
ఎంఈఐఎల్ హైబ్రీడ్ యాన్యుటీ…
హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు శామీర్పేట్ మండలం కేశవాపూర్ వద్ద 10 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ను నిర్మించాల్సి ఉంది. దీనితో పాటు శామీర్పేట పరిసర గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు 750 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటును కూడా నిర్మించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ను ఎంఈఐఎల్ హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో చేపట్టి రూ. 4396.15 వెచ్చిస్తోంది. ఈ విధానం ద్వారా ప్రభుత్వం 20 శాతం నిధులు సమకూరిస్తే మేఘా ఇంజనీరింగ్ 80 శాతం ఖర్చు చేసి నిర్వహణ సమయంలో ప్రభుత్వం నుంచి తిరిగి పొందుతుంది. మేఘా ఇంజనీరింగ్ త్వరలో పనులు చేపట్టి 36 నెలల్లో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాల్సి ఉంది.
గ్రేటర్లోకి ‘మేఘా’ తాగునీరు:
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుకు (ఓఆర్ఆర్) ఆనుకుని ఉన్న 190 గ్రామాలకు తాగునీరు అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ను ఎంఈఐఎల్ యాన్యుటీ కింద చేపట్టింది. రూ. 628 కోట్ల ఖర్చుతో కూడిన ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి రానున్న ఏడేళ్లలో ఖర్చు చేసిన మొత్తాన్ని ఎంఈఐఎల్ ప్రభుత్వం నుండి తిరిగి పొందుతుంది.
నగరపంచాయతీలకు తాగునీటి సరఫరా:
మిషన్ భగీరథ (అర్బన్) పథకంలో భాగంగా తెలంగాణలోని నగర పంచాయతీలు హుస్నాబాద్, ఆంధోల్ జోగిపేట, హుజూర్ నగర్, కోదాడ, దేవరకొండకు తాగునీరు అందించే ప్రాజెక్టును ఎంఈఐఎల్ యాన్యుటీ విధానంలో చేపట్టింది. ఈ ప్రాజెక్టును 15 నెలల్లో మేఘా సంస్థ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను మేఘా ఇంజనీరింగ్ 163.85 కోట్లు ఖర్చు చేయబోతుంది. ఖర్చు చేసిన ఈ మొత్తాన్ని ఏడు సంవత్సరాల నిర్వహణ కాలంలో వాయిదాల పద్ధతిలో ప్రభుత్వం నుంచి తిరిగి పొందుతుంది.
యాన్యుటీలో ‘మేఘా’ ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం:
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 589.72 కోట్ల విలువైన పాఠశాల భవనాల నిర్మాణ ప్రాజెక్టును సర్వశిక్ష అభియాన్ మేఘా సంస్థకు అప్పగించింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాల్లోని 46 మండలాల్లో 1378 ప్రభుత్వ పాఠశాలలు, ప్రకాశం జిల్లాలోని 56 మండలాల్లోని 1048 ప్రభుత్వ పాఠశాలల భవనాలను మేఘా సంస్థ హైబ్రీడ్ యాన్యుటి పద్ధతిన నిర్మించనుంది. ప్రాజెక్టు విలువలో 60 శాతం నిధులను ఎంఈఐఎల్ సమకూర్చటంతో పాటు ఐదేళ్ళపాటు నిర్వహణ బాధ్యతలను చేపట్టనుంది.