మెగా కుటుంబంలో ప్రతి ఒక్కరికీ సొంత బ్యానర్లు ఉన్నాయి. అల్లు అరవింద్ కు ‘గీతాఆర్ట్స్’, పవన్ కల్యాణ్ కు ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ రీసెంట్ గా రామ్ చరణ్ ‘కొణిదల ప్రొడక్షన్స్ కంపనీ’ మొదలు పెట్టారు. మెగాబ్రదర్ నాగబాబు కూడా ‘అంజనా ప్రొడక్షన్స్’ పేరిట నిర్మాణ సంస్థ ప్రారంభించి కొన్ని చిత్రాలను నిర్మించారు. కానీ అందులో రెండు, మూడు తప్ప ఆయనకు పెద్దగా కలిసొచ్చిన సినిమాలు ఏవీలేవు. ఇక ‘ఆరెంజ్’ సినిమా ఆయన్ను ఎంతగా దెబ్బ తీసిందో..అందరికీ తెలిసిందే.
ఆ తరువాత ఆయన సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటూ వస్తున్నారు.అయితే త్వరలోనే ఈ బ్యానర్ లో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అది కూడా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా కావడం విశేషం. రామ్ చరణ్ తో ఆపేసిన ఈ ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు బన్నీ తో రీఓపెన్ చేస్తుండడం మంచి విషయమనే చెప్పాలి.
రచయిత వక్కంతం వంశీ చెప్పినకథ నచ్చడంతో ఆయన డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు అల్లు అర్జున్. వీరి కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాను నాగబాబు, లగడపాటి శ్రీధర్ లు కలిసి నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.