నిన్నటి వరకు వివిధ పార్టీల నేతలను కలిసిన టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. బుధవారం ప్రధాని మోడీతో భేటీ కానుండటంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఫ్రంట్ అంటూ పర్యటనలు చేస్తున్న కేసీఆర్ ప్రధానిని కలవడంలో అర్థమేంటన్నారు. మోడీని కలిసి రాష్ట్ర సమస్యలు వివరిస్తారా? బ్రీఫింగ్ చేయడానికి వెళ్తున్నారా? అని కేసీఆర్ను చంద్రబాబు ప్రశ్నించారు. ఏదైనా ఒక మాట చెప్పడం వేరని, చేసే పనులు వేరేగా ఉంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అవసరమని, దీనికోసం బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలు ఏకం కావాలంటూ కేసీఆర్ వివిధ రాష్ట్రాల నేతలను కలుస్తున్నారు. ఇటీవల ఒడిశా, పశ్చిమ్బంగ ముఖ్యమంత్రులు నవీన్పట్నాయక్, మమతా బెనర్జీతో భేటీ అయి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. మరోవైపు కేంద్రంలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీతోపాటు ఇతర పార్టీల నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారు.