తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం దిండి రిసార్ట్స్ లో రెండు రోజులపాటు జరిగిన జనసేన పార్టీ మేధోమథనం కార్యక్రమంలో అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. జనసేన పార్టీ యొక్క విధి విధానాలు, రానున్న రోజులలో పార్టీ నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. పార్టీ నాయకులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఒకపార్టీని ముందుకి తీసుకెళ్లాలంటే భావజాలం చాలా అవసరం.. నేను పార్టీ పెడితే నిలబడగలమా లేదా అని అనుమానం కూడా వచ్చింది.. నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు.. కానీ ప్రజలు నాపై ఉంచిన నమ్మకంతో పార్టీని కొనసాగించగలను అనే నమ్మకం ఏర్పడింది అని పవన్ అన్నారు. నేను 25 సంవత్సరాలు నా జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాను. అంతేగాని తీసుకోవడానికి రాలేదన్నారు.
అమరావతిలో రాజధాని నిర్మాణంలో భూసేకరణ చట్టం అమలు చేయకుండా కాపాడింది ఒక్క జనసేన పార్టీ మాత్రమేనని పవన్ అన్నారు. పోరాటం అంటే రోడ్లమీదకు వచ్చి గొడవలు చేయడం కాదు.. మీరు నాయకులుగా కార్యకర్తలను అర్థం చేసుకోవాలని.. మీరు కార్యకర్తలకు ఎంత అండగా నిలబడతారో.. మీకూ నేను అంతే అండగా నిలబడతానని పవన్ భరోసా ఇచ్చారు. ఇక్కడ మనం సమావేశం కావడం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడమేనని, మీరు హక్కుల గురించి మాట్లాడితే బాధ్యతలు గురించి కూడా మాట్లాడాలి. జనసేన పార్టీ నుంచి పోటీచేసి వ్యక్తిగతంగా వెళ్తానంటే కుదరదని పలువురికి చురకలంటించారు. కులం.. కులం.. అంటే కులం కూడుపెట్టదు. ఇప్పుడున్న ప్రభుత్వం చాలా కులాలకు వ్యతిరేకమైనా అప్పటికీ ప్రజలు ఒట్లు వేశారు. కులాల ఓటు బ్యాంకు మీద రాజకీయాలు చేస్తామంటే కుదరదు. కేసీఆర్ కులం తెలంగాణలో 2 శాతం కూడా లేదు.. కావలసింది కులంకాదు భావజాలం పెంచుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.
జనసేనకు ఎదురైన ప్రతి పరాజయం వెనుక ఎదుగుదలే ఉంటుందన్నారు. ఒక పార్టీ ప్రభుత్వం వస్తే వేరే పార్టీని ఎదగనివ్వదు. నాలాంటి ఒక బలమైన భావాజాలన్ని పైకి తేవడానికి ఎంతో కష్టపడాలి. ఈ పోరాటంలో గెలుపు ఎంతో తెలియదు. కానీ ప్రాణాలు విడిచేందుకు సైతం సిద్ధంగా ఉన్నా అన్నారు. గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా కనీసం తాగటానికి నీరు కూడా లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు అర్థం చేసుకుని ఏడు సూత్రాలతో కూడిన సిద్దాంతాలు తీసుకొచ్చాం. అవి పార్టీని చాలా ముందుకు తీసుకు వెళ్తాయి. గెలుపు ఓటములతో నాకు సంబంధం లేదు. రాష్ట్రంలో బలమైన టిడిపి ఉన్నప్పటికీ ఒక్క ఎంఎల్ఎ ఉన్న జనసేన దగ్గరకే రాజధాని అంశం ఎందుకు వచ్చింది. మనం పోరాటం చేస్తామన్న నమ్మకం. మన బలాన్ని మీరు గుర్తించండి. ప్రజల్లో బలమైన నమ్మకాన్ని సాధిద్దాం. పార్టీకి ఇచ్చే విరాళాలు వేల కోట్లతో సమానం. పార్టీని నడిపేందుకు డబ్బు కాదు. బలమైన వ్యక్తులు కావాలి. అలాంటి బలమైన వ్యక్తులు ఉన్నారు. పార్టీకి గ్రామ స్థాయిలో కేడర్ను డిసైడ్ చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ యొక్క బలాన్ని గుర్తించాలని, ప్రజా సమస్యలను గుర్తించినప్పుడే ప్రజలకు బలమైన నమ్మకం కలుగుతుందని దానికి అనుగుణంగా అందరూ పనిచేయాలని పవన్ కల్యాణ్ అన్నారు.