2019 సార్వత్రిక ఎన్నికల కోసం పవన్కల్యాణ్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకోసం ఏపీలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జనసేన మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ఇటీవలే ప్రకటించారు. వామపక్షాలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు. అయితే తన ప్రచారంలో తెలుగు సినిమా దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఎన్టీఆర్ చేసిన ఓ వ్యాఖను ప్రస్తావిస్తూ.. తాను ఎన్టీఆర్లా అహంకారాన్ని తలకెక్కించుకోనని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. “ఎన్టీఆర్గారు మెదక్ లో కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అని మాట్లాడారు, ఆ ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు, నా వెనుక లక్షలాది మంది జనసైనికులు ధవళేశ్వరం అయినా, అనంతపురంలో అయినా వచ్చారని నేను తలకి ఎక్కించుకోను” అని పవన్ అన్నారు. ఈ వ్యాఖ్యలను జనసేన పార్టీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ తన పార్టీ గురించి, తన గురించి ప్రచారం చేసుకోవాలని.. తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన ఎన్టీఆర్ను ఉద్ధేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిమానులు మండిపడుతున్నారు.