గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కడప జిల్లా జనసేన పార్టీ నేతలతో విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత జగన్ మాదిరిగా సీఎంను కాల్చేయండి.. చంపేయండి వంటి మాటలు తాను మాట్లాడనన్నారు. తన విమర్శలు సిద్ధాంతపరమైనవే కానీ వ్యక్తిగతంగా కాదని స్పష్టంచేశారు. టీడీపీ, వైసీపీలు తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్కు అధికారం కోసం ఆరాటమే తప్ప ప్రజాసంక్షేమం పట్టదని విమర్శించారు. సంక్రాంతి పండుగ తర్వాత జనసేన సంస్థాగత కమిటీల ఏర్పాటు ఉంటుందని తెలిపారు. జనసేనకు యువత, మహిళలే ప్రధాన బలమని, యువశక్తి రాజకీయ శక్తిగా మారడానికి కొంత సమయం పడుతుందని పవన్ చెప్పారు.