టీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్లో చేరనున్నారని తాను చెప్పిన మాటలు ఇప్పుడు నిజమేనని తేలుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్కు, ఎంపీ పదవికి రాజీనామా చేయడంపై ఆయన స్పందించారు. మరో ఇద్దరు కూడా టీఆర్ఎస్ను వీడే అవకాశం ఉందన్నారు. డిసెంబర్ 7లోపు రెండు వికెట్లు పడతాయని తాను చెప్పానని, ఇప్పడు రెండు కాదు మూడు వికెట్లు పడతాయని వ్యాఖ్యానించారు. తాను చెప్పిన పై మాటను పెద్దగా పట్టించుకోలేదని, వారు కండువా కప్పుకున్నప్పుడు మీకే అర్థమవుతుందంటూ మీడియాను ఉద్దేశించి అన్నారు. ఈ నెల 23న మేడ్చల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తర్వాత తొలిసారి తెలంగాణకు వస్తోన్న సోనియా గాంధీకి ఘన స్వాగతం పలకాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించడం ద్వారా సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని సూచించారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని తన కుటుంబం విలాస జీవితం గడిపేందుకు సీఎం కేసీఆర్ వినియోగించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.