సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి (86) నిన్న రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గత వారం ఇంట్లో పడిపోవడంతో తుంటి ఎముక విరిగింది. నిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. అయితే, ఇతర అనారోగ్య సమస్యలతో రాత్రి 2 గంటల టైమ్లో ఆయన కన్నుమూశారు. శ్రీహరి భార్య లక్ష్మి గత ఏడాది నవంబర్ లో మరణించారు. ఆయనకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. భార్య మరణించిన తర్వాత ఆయన పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. విదేశాల్లో ఉన్న కుమారుడు శ్రీరామ్ స్వదేశానికి చేరుకోగానే అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
గుడిపాటి శ్రీహరి దాదాపు అర్ధ శతాబ్దం పాటు పాత్రికేయుడిగా, సినీ విశ్లేషకుడిగా సేవలను అందించారు. ఈనాడు, హిందూ, ఫిల్మ్ ఫేర్ వంటి ప్రముఖ పత్రికల్లో పని చేశారు. ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ’ అనే పుస్తకాన్ని రచించారు. 1969 నుంచి హిందూ పత్రికకు రివ్యూలు రాయడం ప్రారంభించారు. ఇరవై ఏళ్ల పాటు ఆలిండియా రేడియోకు ఆయన సేవలందించారు. ఈనాడు దినపత్రికలో ‘హరివిల్లు’ పేరుతో 25 ఏళ్లపాటు ఆయన శీర్షికను నిర్వహించారు. శ్రీహరికి తెలుగు విశ్వవిద్యాలయం 2013లో ‘కీర్తి పురస్కారం’ను ప్రకటించింది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.