ఎన్టీఆర్ ఘాట్ వద్ద కూకట్పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని, బాలకృష్ణ ఈ ఉదయం నివాళులర్పించారు. అనంతరం సుహాసిని మీడియాతో మాట్లాడారు. మా తాతా, నాన్న, మావయ్య ఆశీస్సులతో ప్రజాసేవకు ముందడుగు వేస్తున్నానని.. తనకు తెలుగు మహిళల మద్దతు కావాలని కోరారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రైతులు, మహిళలకు ఎన్టీఆర్ అండగా ఉన్నారని పేర్కొన్నారు. ‘మా ఆడపడుచు నందమూరి సుహాసిని రాజకీయాల్లోకి వస్తోంది. మా ఆశయాలను ఆమె ముందుకు తీసుకెళ్తారు. టీడీపీపై చూపిస్తున్న అభిమానాన్నే సుహాసినిపై కూడా చూపాలని కోరుతున్నా. యువత, అభిమానులు, కార్యకర్తలు కలిసి రావాలని కోరుతున్నా. సుహాసినికి అఖండ విజయాన్ని అందించాలి. ఇదే నందమూరి హరికృష్ణకు మనం ఇచ్చే నివాళి’ అని బాలకృష్ణ అన్నారు. తెలంగాణలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా? అని విలేకరులు అడగ్గా.. ‘ఎవరిష్టం వారిది.. ఆయన షెడ్యూల్ ప్రకారం ఆయన నిర్ణయం తీసుకుంటారు’ అని అన్నారు. హరికృష్ణకు ఉన్న స్నేహం, అభిమానంతోనే ఆయన స్మారకానికి కేసీఆర్ స్థలం కేటాయించారని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
మహాప్రస్థానంలోని హరికృష్ణ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం సుహాసిని కూకట్పల్లి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. మూసాపేటలోని కూకట్పల్లి సర్కిల్ కార్యాలయంలో నామినేషన్ కార్యక్రమం ఉండనుంది. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొంటారు.