సూపర్ స్టార్ మహేష్బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నుంచి ప్రముఖ నటుడు జగపతిబాబు తప్పుకొన్నారని ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై జగపతిబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఓ వీడియోను తన ట్విటర్ వేదికగా పంచుకొన్నారు. ‘చిత్ర పరిశ్రమ నా ఫ్యామిలీలాంటిది. అందుకే దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టంలేదు. కానీ, ఒక విషయంలో స్పష్టత ఇవ్వక తప్పడం లేదు. నా 33ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ ఇలా వివరణ ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఇదే మొదటిసారి. అనిల్రావిపూడి-మహేష్బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా నుంచి నేను తప్పుకొన్నానని సోషల్మీడియాలో రకరకాల పుకార్లు వస్తున్నాయి. అందులో నిజం లేదు. ఇప్పటికీ ఆ పాత్ర నాకు బాగా నచ్చింది. చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ సినిమా కోసం మరో రెండు సినిమాలు వదులుకోవడం కూడా నిజం. కానీ, ఇండస్ట్రీలో కొన్ని కారణాల వల్ల ఇంకొన్ని విషయాలు జరుగుతాయి. తప్పవు. ఆ పరిస్థితి వల్ల సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ సినిమాను, పాత్రను మిస్ అవుతున్నా. ఏదేమైనా చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్’ అని జగపతిబాబు వీడియోలో పేర్కొన్నారు.
దీనిపై దర్శకుడు అనిల్ రావిపూడి కూడా మాట్లాడారు. జగపతిబాబు సినిమాలో నటించడం లేదని వెల్లడించారు. ‘సరిలేరు నీకెవ్వరు’ లోని తన పాత్ర జగపతిబాబుకు నచ్చింది. ఈ చిత్రంలో ఆయన నటించాలనుకున్నారు, ప్రాజెక్టు నుంచి వైదొలగలేదు. కానీ కొన్ని కారణాల వల్ల మేమే దాన్ని సాధ్యం చేయలేకపోయాం. త్వరలో జగపతిబాబుతో కలిసి మరో ప్రాజెక్టు కోసం పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా. పరిస్థితుల్ని అర్థం చేసుకుని, స్నేహంగా వ్యవహరించిన మీకు ధన్యవాదాలు సర్. మిమ్మల్ని ఎంతో గౌరవిస్తున్నాం’ అని దర్శకుడు పోస్ట్ షేర్ చేశారు.
ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం షూటింగ్ కశ్మీర్లో జరుగుతోంది. మహేష్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ సినిమా కోసం సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పనిచేస్తున్నారు. ఇందులో మహేష్ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. సీనియర్ నటి విజయశాంతి చాలా ఏళ్ల విరామం తర్వాత ఈ చిత్రంలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్రాజు, మహేష్బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.