టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు చిరస్మరణీయమైన విజయం కట్టబెట్టారని కేటీఆర్ అన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత మాపై ఉంది అని కేటీఆర్ అన్నారు. అలాగే వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలో జరగబోయే వివిధ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా తనపై ఉందన్నారు. అన్ని రాజకీయ పక్షాలు ఒకవైపు, కేసీఆర్ ఒకవైపు నిలబడితే ప్రజలు కేసీఆర్ వైపు నిలబడి చిరస్మరణీయ విజయం అందించారు. అందుకు ప్రజలకు శిరసు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా. 2 కోట్ల మంది ఓటింగ్ పాల్గొంటే 98 లక్షల ఓట్లు టీఆర్ఎస్కు వచ్చాయి. ఆ తర్వాతి స్థానంలో నిలిచిన కాంగ్రెస్కు, మా పార్టీకి మధ్య 45 లక్షల ఓట్ల వ్యత్యాసం ఉంది. మరో జాతీయ పార్టీగా చెప్పుకునే బీజేపీకి 103 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయి. 100 స్థానాల్లో డిపాజిట్లు పోతాయని ఎన్నికలకు ముందే చెప్పా. ఆ పార్టీ తరఫున మోడీ, అమిత్షా ప్రచారం చేసినా ఉపయోగం లేదు. కేసీఆర్పై ఉన్న నమ్మకంతోనే ప్రజలు టీఆర్ఎస్కి విజయాన్ని కట్టబెట్టారు. దాదాపు 75 శాతం సీట్లు అందించారు.
ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. పార్టీ, ప్రభుత్వ నిర్వహణలో, జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ ప్రభావ వంతమైన పాత్ర పోషించాలన్న ఉద్దేశంతో నాకు కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 4 ఎన్నికలు చూశా. ఈ అనుభవం బట్టి క్షేత్రస్థాయిలో ఇంకా టీఆర్ఎస్ బలోపేతం కావాల్సి ఉంది. వందేళ్ల పాటు పటిష్టమైన పార్టీగా రూపొందించాల్సిన అవసరం ఉంది. ఓవైపు హామీలను నెరవేరుస్తూనే.. త్వరలో జరగబోయే పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. పార్టీని సమర్థంగా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ స్వతహాగా గెలుపొందే అవకాశం లేదని, లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 17 లోక్సభ స్థానాల్లో 16 చోట్ల టీఆర్ఎస్ గెలుస్తుంది. దేశ ప్రధానిని నిర్ణయించే నిర్ణయాత్మక శక్తి తెలంగాణకు వస్తుంది. తెలంగాణలో అమలౌతున్న పథకాలు దేశవ్యాప్తంగా రావాలంటే జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది’ అని కేటీఆర్ అన్నారు.