సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో 10శాతం కోటా కల్పించనున్నారు. వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణాలకు చెందినవారంతా ఈ కోటా పరిధిలోకి వస్తారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లును రేపు కేంద్రం పార్లమెంట్ ముందు పెట్టే అవకాశం ఉంది. చాలా కాలంగా ఈ డిమాండ్ ఉండగా.. ఎన్నికలకు ముందే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బిల్లు కోసం రేపటితో ముగియనున్న పార్లమెంట్ సమావేశాలను రెండు రోజులపాటు పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేయాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16లకు సవరణలు చేయాల్సి ఉంటుంది. వ్యక్తికి రూ.8లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం, 5 ఎకరాల కంటే తక్కువ సొంత వ్యవసాయ భూమి, వెయ్యి చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో ఇల్లు, నోటిఫైడ్ పురపాలిక పరిధిలో 109 గజాల కంటే తక్కువ నివాస స్థలం, నోటిఫైడ్ కాని మున్సిపాలిటీ పరిధిలో 209 గజాల కంటే తక్కువ స్థలం ఉన్నవారిని ఆర్థికంగా వెనుకబడిన వారిగా పరిగణిస్తారని తెలుస్తోంది. వీరికి రిజర్వేషన్ వర్తించే అవకాశం ఉంటుందని సంబంధిత వర్గాల నుంచి సమాచారం. ఇప్పటి వరకు రిజర్వేషన్ వల్ల ఎలాంటి ప్రయోజనం పొందని ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ రిజర్వేషన్లు అందుతాయని తెలుస్తోంది. కుల ఆధారిత రిజర్వేషన్లు 50శాతం మించకూడదని గతంలో సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే ఈ పది శాతం రిజర్వేషన్పై సవరణలను పార్లమెంటు ఆమోదిస్తే కోటా 50శాతం దాటి పోనుంది.