ప్రస్తుతం దేశమంతా లాక్డౌన్ కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ ప్రకటించి 3 రోజులు గడిచిపోయింది. మరో 19 రోజులు గడిస్తే లాక్డౌన్ నుంచి బయటపడొచ్చని దేశ ప్రజంతా ఎదురుచూస్తున్నారు. ఈలోగా కరోనా మహమ్మారిని తరిమికొట్టగలమని, సాధారణ జీవితం సాగించవచ్చని ఆశిస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే
లాక్డౌన్ కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇతర దేశాలకంటే భారత్లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే లౌక్డౌన్ మాత్రం ఇప్పుడే ముగిసేటట్టు కనిపించడం లేదని అంటున్నారు.
లాక్డౌన్ ప్రకటించిన రెండు రోజుల తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరోనా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. లాక్డౌన్ కారణంగా దెబ్బతిన్న పేద ప్రజలు, దినసరి కూలీలకు ఆర్థిక సహాయం అందించేందుకు రూ. 1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే వచ్చే 3 నెలల రేషన్కు అదనంగా 5 కిలోల బియ్యం లేదా గోధుమలు మరియు కిలో కందిపప్పు ఇస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా రైతులు, ఉపాధి హామీ కూలీలు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, డ్వాక్రామహిళలకు ప్రయోజనం కల్పిస్తూ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్యాకేజీ 21 రోజులకు కాకుండా 3 నెలలకు ప్రకటించడంపై కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రుణాలు, ఈఎంఐలపై 3 నెలల పాటు మారటోరియం విధిస్తూ ఆర్బీఐ ఇవాళ ప్రకటన చేసింది. కేంద్రం చర్యలతో లాక్డౌన్ 3 నెలల పాటు పొడిగిస్తారని ప్రచారం జరుగుతోంది.