ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఇంకా ఏడాది కంటే ఎక్కువ దూరంలోనే ఉన్నాయి. కానీ, పార్టీలు మాత్రం తమ వ్యూహాలను జెడ్ స్పీడ్ లో సిద్ధం చేసుకుంటున్నాయి. గెలిచిన వాళ్ళు మళ్లీ గెలవడానికి, ఓడిన వాళ్ళు మళ్లీ ఎలాగైనా గెలవడానికి. ఈ మధ్యలో అసంతృప్తి నాయకులు, టికెట్ గ్యారంటీ లేని ఆశావహులు ఎన్నికల గోదాలోకి దూకేసేందుకు ఇప్పటికే సన్నద్ధం అయ్యారు. మరోవైపు ఎన్నికల సమయంలో ఉండగల బీభత్స వాతావరణాన్ని ఇప్పటి నుంచే ఏపీ ప్రజలకు రుచి చూపించడానికి కొన్నిచోట్ల యుద్ధ వాతావరణం తలపిస్తోంది. ఇంతకీ వచ్చే ఎన్నికల్లో అసలేం జరగబోతుంది ?, తమ గురించి తాము చెప్పుకుని గెలవగలమనే నమ్మకం జగన్ సర్కార్ లో కనిపించడం లేదు. మరోవైపు జగన్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ప్రతిపక్షాలు ఎంతవరకు క్యాష్ చేసుకుంటాయి ? అనేది చూడాల్సి ఉంది.
మొత్తం ఈ సినారియోలో ప్రజలే మహా నటులు. అందులో ఏపీ ప్రజలు మహోన్నతమైన నటులు. కాబట్టి.. వారి నటనను అంచనా వేయడం అసాధ్యం. కానీ, ఏపీ ప్రజలు ఈ సారి వేసే ఓటు వారి రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం. జగన్ రెడ్డి తాను చేపడుతున్న సంక్షేమ పథకాలనే నమ్ముకున్నాడు. తన సంక్షేమమే తనకు అండ అని, మళ్లీ గెలిపిస్తుందని పూర్తిగా విశ్వసిస్తున్నాడు. ఐతే, అసలు వాస్తవాలు ఏమిటి ?, ప్రతి ఇంటికీ జగన్ ప్రభుత్వం ద్వారా ఎంత లబ్ధి చేకూరుతుందో.. అంతకంటే ఎక్కువే మరో రూపంలో పోతుంది కదా. మరి దీని గురించి చెప్పేదెవరు ?, సామాన్య జనం కదా. జగన్ రెడ్డి లెక్కలు వారి బుర్రలకు ఎక్కవు.
సరే, జగన్ రాజకీయ ప్రత్యర్థులు అయినా జగన్ రెడ్డి గురించి చెబుతారేమో అంటే.. బలంగా జనం గుండెల్లోకి చొచ్చుకుపోయేలా చెప్పలేకపోతున్నారు. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ పేరుతో ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టనష్టాలను తెలుసుకుంటూ.. వాటికీ కారణం జగన్ రెడ్డే అని బాబు బాగానే చెబుతూ వచ్చారు. కానీ, ప్రస్తుతం ఆ కార్యక్రమం మధ్యలోనే ఆగిపోయింది. అయినప్పటికీ జగన్ రెడ్డిలో భయం మాత్రం పోవడం లేదు. ప్రతిపక్షాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది అని జగన్ కుమిలిపోతున్నాడు. నిజంగా జగన్ రెడ్డిని చూస్తే ఒక్కోసారి జాలిపడాలనిపిస్తుంది. తనకి అన్ని దార్లు మూసుకుపోతున్నాయి.
బటన్ల మీద బటన్లు నొక్కి డబ్బులు పంచి పెడుతున్నా ఈ జనం జగన్ని నమ్మే పరిస్థితి ఉండటం లేదు. తన పథకాలే తనను గెలిపిస్తాయని ఎక్కడో రవ్వంత ఆశ జగన్ రెడ్డిలో ఉన్నా.. ఇప్పుడు తన పార్టీలో మొదలైన అసంతృప్తిల లుకలుకల ముందు నిలబడి మళ్లీ గెలవడం కష్టమే. జగన్ రెడ్డి స్థితి ప్రస్తుతం ఎంత దిక్కుమాలిన స్థితిలో ఉందో దీనిబట్టి అర్థమౌతోంది. ఇంకా ఏడాదికి పైగానే అధికారంలో ఉన్నా.. తన సొంత ఎమ్మెల్యేలే తన మొహం మీదే ఛీ అంటున్నారు. జగన్ రెడ్డి పెట్టిన కుల మంటల సెగే తనను, తన పార్టీని బాధ పెడుతుందని ఇప్పుడిప్పుడే జగన్ కి అర్ధం అవుతుంది.
అయినా, జగన్ రెడ్డిని తక్కువ అంచనా వేయలేం. నవ్వుతూనే తడిగుడ్డతో గొంతును పిండేయగలడు. ఎంత ధైర్యం లేకపోతే.. అలవిమాలిన హామీలను మేనిఫెస్టోలో ప్రకటించేసి.. ప్రజలను వంచించి.. ఇచ్చిన ఏ హామీని పూర్తిగా అమలు చేయకుండా.. తన మేనిఫెస్టోలో ఉన్న హామీలు అన్నీ 95 శాతం పూర్తిచేసేశానని మళ్లీ ఒక కరపత్రం ముద్రించి.. వాటిని ఇంటింటికీ పంపిణీచేస్తూ ముందుకు సాగుతున్నాడు అంటే.. అసలు జగన్ రెడ్డి గురించి ఏం మాట్లాడుకోవాలి ?. ఏమీ మాట్లాడుకున్నా.. వృధానే.