మేఘా.. మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) మరో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. దేశం ఇంధనరంగంలోనే అతిపెద్ద ప్రాజెక్టును పూర్తి చేసి ‘సరిలేరు’ నాకెవ్వరూ అంటూ నినదించింది. అసోం రాష్ట్రంలో ఓఎన్జీజీసీ చేపట్టిన దేశంలోనే అతిపెద్ద చమురు, ఇంధన వాయువు సేకరణ, నిల్వ, రవాణా వ్యవస్థ అసోం రెన్యూవల్ ప్రాజెక్ట్ (ఏఆర్పి)ను మేఘా సంస్థ అధునాతన పద్ధతిలో పునర్నిర్మించి దేశానికి గొప్ప బహుమతిని అందించింది. అతి తక్కువ టైంలో ప్రాజెక్టు చేపట్టి వాయువేగంతో పూర్తి చేసి భారత ఇంధన రంగ చరిత్రలో మేఘా కలికితురాయిగా నిలబడింది.. అసోం రాష్ట్రంలో ఓఎన్ జేసీకి దేశంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం ఉంది. ప్రతిష్టాత్మకమైన ‘‘ఆన్షోర్ చమురు, ఇంధన వాయువు సేకరణ, నిల్వ, రవాణా వ్యవస్థ అసోం రెన్యూవల్ ప్రాజెక్ట్ (ఏఆర్పి)’’ ప్రాజెక్టు మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వ్యవస్థ, ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా లేకపోవడంతో రూ. 2400 కోట్ల అంచనా వ్యయంతో ఆధునీకరణ పద్ధతిలో పునర్ నిర్మించారు. ఈ పనిని ఈపీసీ పద్ధతిలో దక్కించుకున్న మేఘా సంస్థ (ఎంఇఐఎల్) తాజాగా అసోం రాష్ట్రంలోని లఖ్వా గ్రూప్ గ్యాదరింగ్ స్టేషన్ (జీజీఎస్)ను పూర్తిచేసి జాతికి అంకింతం చేయడం ద్వారా దేశానికి గొప్ప బహుమతిని అందించింది.
అసోం రెన్యూవల్ ప్రాజెక్ట్ ఆధునీకరణ వల్ల ముడి చమురు ఇంధన ప్రాసెసింగ్ సామర్థ్యం గణనీయంగా పెరుగుతోంది. ఇప్పుడు రోజుకు క్రూడాయిల్ ప్రాసెసింగ్ 10,000 ఘణపు మీటర్లు, శుద్ధి సామర్థ్యం 12,000 ఘణపు మీటర్లు, వాటర్ ఇంజెక్షన్ సామర్థ్యం 5,300 ఘణపు మీటర్లు సాధ్యమవుతుంది. అదే విధంగా ఖనిజ వాయువు ఎల్డీ కంప్రెషర్ ప్రాసెసింగ్ మూడు రకాలుగా ఉంటుంది. తక్కువ, మధ్య, అధిక రకాలు ఉంటాయి. అవి వరుసగా 16 లక్షల ఘణపు మీటర్లు, 10 లక్షల ఘణపు మీటర్లు, 15 లక్షల ఘణపు మీటర్ల చొప్పున ప్రతీరోజూ కంప్రెస్ చేస్తారు. సెంట్రల్ ట్యాంక్ సామర్థ్యం 50 వేల ఘనపు మీటర్లు.
అసోంలోని ఈ చమురుశుద్ధి కర్మాగారం ఆధునిక పనులు ప్రారంభించిన మేఘా( ఎంఇఐఎల్) సంస్థ వెల్ ఫ్లూయిడ్ లింక్తో పాటు చమురు, గ్యాస్ సరఫరా అయ్యే పైపులైన్లను, గ్యాస్ లిఫ్ట్ లైన్లు, వ్యవస్థను సమర్థంగా పనిచేసేందుకు ఉపయోగపడే వాటర్ ఇంజెక్షన్ లైన్లను నిర్మించింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించడం ద్వారా కార్బన్ ఉద్ఘారాలను తగ్గించి వాతావరణ కాలుష్యాన్ని నిరోధించడంలో ఈ ప్రాజెక్ట్ కీలకభూమికను నిర్వహించనుంది. గతంలో ఈ విధమైన అధునాతన పద్ధతి ఉండేది కాదు. ఇందుకు అవసరమైన పైపులు, వివిధ యంత్రాల పరికరాలను ఎంఇఐఎల్ సొంతంగా ఉత్పత్తి చేసింది. సంస్థకు చెందిన జీడిమెట్లలోని కర్మాగారం నుంచి వీటిని తయారుచేసి నేరుగా అసొంకు సరఫరాచేసి అక్కడ నిర్మాణంలో ఉపయోగించారు.
అస్సాంలోని ఓఎన్జీసీ ప్రాజెక్ట్ వ్యవస్థను పునర్ నిర్మించి ప్రభుత్వానికి మేఘా అప్పగించింది. ఇందులో ప్రధానంగా బావి నుంచి లభించే ముడి చమురును గ్యాస్, డీజిల్, ఇతర అనుబంధ ఉత్పత్తుగా వేరుచేసే సెపరేటర్లు ఉన్నాయి. వీటిని మేఘా అత్యంత అధునాతన సాంకేతిక పద్ధతుల్లో నిర్మించింది. ఇక్కడి పర్యావరణానికి హాని కలిగించని విధంగా ఉత్పత్తులను ప్రాసెస్ చేసే తదనంతరం నిల్వ, సరఫరాకు అవసరమైన నిర్మాణాలు జరిగాయి. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో రాబోయే మూడు దశాబ్దాల అవసరాలకు తగిన విధంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిర్మాణాలను మేఘా నిర్మించి దేశానికి గొప్ప కానుక ఇచ్చిందని.. ఇది భారత దేశ ఇంధన అవసరాలు తీర్చగలదని.. సంస్థ కృషి దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.