
ఈ రోజు రాజకీయ నాయకుల గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. విడదల రజని. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ అటెన్షన్ సాధించిన అతికొద్ది రాజకీయ వ్యక్తుల్లో విడదల రజిని కూడా ఒకరు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవడంలో ఆమె మహా దిట్ట. 32 ఏళ్ల చిన్న వయసులోనే మంత్రి పదవిని అధిరోహించిన చరిత్ర ఆమెది. ఇంతకీ రాజకీయ నాయకురాలిగా విడదల రజని గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో విడదల రజని పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో విడదల రజని పరిస్థితేంటి ?, అసలు ఆమె నేపథ్యం ఏమిటి ? మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ విడదల రజనికి ఉందా ? తెలుసుకుందాం రండి.
ముందుగా విడదల రజిని నేపథ్యం విషయానికి వస్తే.. హైదరాబాద్లో 1990 జూన్ 24న ఆమె జన్మించారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన రజిని.. మల్కాజ్గిరిలోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో 2011లో బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేశారు. అనంతరం ఎంబీఏ కూడా పూర్తి చేశారు. ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా కొన్నాళ్లు పనిచేసిన రజినికి.. విడదల కుమారస్వామితో వివాహం జరిగింది. ఈ వివాహం ఆమెకు బాగా కలిసి వచ్చింది. ఆర్ధికంగా ఆమె ఎదుగుదలకు బాగా ఉపయోగపడింది. అమెరికాలో ఆమె భర్త కుమారస్వామి సాఫ్ట్వేర్ మల్టీ నేషనల్ కంపెనీ ప్రాసెస్ వీవర్ కంపెనీ ఏర్పాటు చేశారు. దీనికి కొన్నాళ్ల పాటు డైరెక్టర్, బోర్డు మెంబర్గా రజని సేవలు అందించారు. ఈ కంపెనీ బాగా సక్సెస్ కావడంతో రజని కుటుంబం ఆర్థికంగా బాగా స్థిరపడింది. అప్పుడే రజని మనసులో రాజకీయ కోరిక కలిగింది.
తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన విడదల రజిని.. అక్కడ కూడా తక్కువ సమయంలోనే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టిని ఆకర్షించారు. ఓ సమావేశంలో తాను, చంద్రబాబు నాటిన మొక్కనని.. ఆయన కట్టిన హైటెక్ సిటీలో ఉద్యోగం చేసి, అక్కడి నుంచి అమెరికా వెళ్లి ఈ స్థాయికి వచ్చానని ఘనంగా చెప్పుకొచ్చింది. ఐయితే, టీడీపీలో ఆ మొక్కకు ఎదుగుదల ఉండదు అని, విడుదల కుమారస్వామి ఆమెను వైసీపీ గూటికి చేర్చాడు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గంలో పోటీ చేసి రజని విజయం సాధించారు. 2022 లో జగన్ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గా కూడా ఆమె బాధ్యతలు చేపట్టారు.
విజయం అయితే విడదల రజనికి ఈజీగా లభించింది గానీ, ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం ఇప్పుడు ఆమెకు పెద్ద సవాల్ గా మారింది. ఇప్పటికే, చిలకలూరిపేటలో టీడీపీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. తన నియోజకవర్గంలో గెలిచిన రజనిని ఈ సారి ఓడించడానికి ఆయన అన్నీ రకాలుగా సన్నద్ధం అయ్యారు. మరి పత్తిపాటి పుల్లారావు ని ఈ సారి ఎదుర్కోవడం విడదల రజనికి కష్టమే. ఇంతకీ వచ్చే ఎన్నికల్లో విడదల రజని పరిస్థితి ఎలా ఉండబోతుంది ?, అలాగే ఆమె గ్రాఫ్ విషయానికి వస్తే.. రజని ప్రజల్లో పట్టు కోల్పోయారు. పైగా ఆమె తీరు పై కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. శాసనసభ వేదికగా, సీఎం జగన్పై ఓ రేంజ్లో పొగడ్తలు కురిపించడం తప్ప, విడదల రజిని చిలకలూరిపేట ప్రజలకు చేసింది ఏమీ లేదు అని ప్రజల్లో టాక్ ఉంది,
నిజానికి రజని నిత్యం ప్రజల్లో ఉండటానికి ప్రయత్నిస్తున్నా.. ప్రజల సమస్యలను మాత్రం ఆమె తీర్చలేకపోతున్నారు. అలాగే, సోషల్ మీడియాలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసుకుని.. ఎప్పటికప్పుడు తన గళాన్ని వినిపిస్తున్నా.. తనను ట్రోల్ చేయకుండా ఆమె అడ్డుకోలేకపోతుంది. ఇన్నాళ్లు ప్రజల్లో యాక్టివ్గా ఉండటం, అన్ని వర్గాలకు అందుబాటులో ఉండడం తనకు బాగా కలిసొచ్చే అంశాలు అని రజని చెప్పుకునేవారు. కానీ, చివరకు వాటి వల్ల ఆమె ఇమేజ్ బాగా డ్యామేజ్ అయ్యింది. ఆమె వల్ల ఏమీ కాదు అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వెళ్ళింది. కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో విడదల రజని గెలవడం కష్టమే.













