HomeTelugu Big Storiesహ్యాపీ బర్త్‌డే ఎంఎస్‌ ధోనీ

హ్యాపీ బర్త్‌డే ఎంఎస్‌ ధోనీ

1a 2

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇవాళ 39వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. దేశానికి రెండు వరల్డ్ కప్‌లు, ప్రపంచ క్రికెట్ లో మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఒకే ఒక్క కెప్టెన్‌గా చరిత్రలో నిలిచాడు ధోని. భారత క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించాడు. 1981 జులై 7న రాంచీలో పుట్టిన ధోని 2004లో భారత జట్టు తరఫున వన్డేల్లోకి ప్రవేశించాడు. మొదట్లో దోనీ ఆటలో అంతగా ఆకట్టుకోలేదు. 2005లో భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ చివరి మ్యాచ్ లో 123 బంతుల్లో 148 పరుగులతో చెలరేగిపోయాడు. ఇక ఆ తర్వాత నుంచి ధోనీ వెనక్కి చూసుకోవాల్సి రాలేదు.

2005లోనే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 145 బంతుల్లో 183 పరుగులు తీసి భారత్ తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2007 టీ-20 ప్రపంచ కప్ కు ముందు అనుకోకుండా ధోనీ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. ఆ టోర్నమెంట్ చివరి మ్యాచ్‌లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ధోనీ 2008, 2009 లోవరుసగా ఐసీసీ వన్డే ప్లేయర్ అఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు. అప్పటివరకు ఈ అవార్డును రెండుసార్లు అందుకున్న ఏకైక ఆటగాడు ధోనీ మాత్రమే.

1c

కెప్టెన్ గా ఎంపికైన తర్వాత నుంచి జట్టును విజయపథంలో నడిపిస్తున్న ధోనీ 2011 లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో 79 బంతుల్లో 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌కు ప్రపంచ కప్‌ని అందించాడు. భారత 28 ఏళ్ళ కలను నెరవేర్చాడు. అయితే అప్పటికే బెస్ట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న ధోనీ ఆ మ్యాచ్ చివర్లో కొట్టిన సిక్సర్ భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 1983లో కపిల్ దేవ్ తర్వాత ఈ టైటిల్ అందుకున్న రెండో భారత కెప్టెన్ ధోనీ. 2013 ఛాంపియన్ ట్రోఫీ విజయం తో క్రికెట్ చరిత్రలో అన్ని ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ గా నిలిచాడు ధోని. కేవలం భారత జట్టునే కాకుండా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మూడు సార్లు టైటిల్ అందించాడు.

2017 జనవరి లో వన్డే మరియు టీ 20 కెప్టెన్సీ బాధ్యతల నుండి ధోనీ తప్పుకున్నాడు. అప్పటినుండి ధోని కెరియర్ పై అనుమానాలు మొదలయ్యాయి. అలాగే తన రిటైర్మెంట్ ప్రశ్న వెలుగులోకి వచ్చింది. అందుకు తగ్గట్టుగానే గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్ తర్వాత నుంచి జట్టుకి దూరం గా ఉంటున్నాడు బీసీసీఐ తమ కాంట్రాక్టులో కూడా ధోనీకి చోటు కల్పించలేదు. దీంతో అందరి అనుమానాలు ఇంకా బలపడ్డాయి. ధోనీ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ తో మళ్లీ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చి టీ-20 ప్రపంచ కప్ లో భారత్ తరపున ఆడాలి అనుకున్నాడు. కరోనా కారణంగా టీ-20 ప్రపంచ కప్ వాయిదా పడుతోంది. ధోనీ ఎప్పుడెప్పుడు గ్రౌండ్ లోకి అడుగు పెడతాడా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu