ఏపీలో తాజా రాజకీయ సంచలనంగా మారారు వైసీపీ ఎమ్మెల్యే ‘మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి’. వైసీపీ పార్టీ పరిశీలకుడు ధనుంజయరెడ్డి పెత్తనం తనపై ఇక కుదరదు అంటూ ఏకంగా జగన్ రెడ్డి పైనే ఇన్ డైరెక్ట్ విమర్శలు చేశారు మేకపాటి. ఇంతకీ రాజకీయ నాయకుడిగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో మేకపాటి పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ మేకపాటికి ఉందా ? తెలుసుకుందాం రండి.
నెల్లూరు రాజకీయ దిగ్గజం మేకపాటి రాజమోహన్ రెడ్డి సోదరుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితుడైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రహ్మణపల్లి గ్రామంలో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కావలి జవహర్ భారతి కళాశాలలో పీయూసీ (ఇంటర్) పూర్తి చేశారు. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ నేపథ్యంలోకి వెళ్తే.. కుటుంబ వారసత్వంగా వచ్చిన వ్యవసాయం చేస్తున్నప్పటికీ సోదరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు రాజమోహన్ రెడ్డి వ్యాపార వ్యవహారాలలో చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు చంద్రశేఖర్ రెడ్డి.
మొదట బూదవాడ సొసైటీ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2004, 2009 లలో అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జగన్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మేకపాటి సోదరులు 2012 లో జరిగిన ఉప ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 లో వచ్చిన జగన్ సునామీలో సునాయాసంగా నాలుగోసారి విజయం సాధించారు చంద్రశేఖర్ రెడ్డి.
మేకపాటి కుటుంబానికి ప్రజల మధ్యన వారధిగా చంద్రశేఖర్ రెడ్డిని అక్కడి ప్రాంత ప్రజలు భావిస్తారు. ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాల ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న నాయకుడిగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుర్తింపు ఉంది. ఐతే, మేకపాటికి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నా ఆయన రెండో భార్య శాంతమ్మ షాడో ఎమ్మెల్యేగా అవతారం ఎత్తి ఉదయగిరి నియోజకవర్గంలో చక్రం తిప్పుతూ పలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా నియోజకవర్గానికి చెందిన అన్ని వ్యాహరాలు ఆమె కనుసన్నల్లో జరగాలని కోరుకుంటున్నట్లు సొంత పార్టీ నేతలే బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీ పరిశీలకుడు ధనుంజయరెడ్డికి మేకపాటికి మధ్య గ్యాప్ పెరిగింది. ధనుంజయరెడ్డి ప్రతి విషయాన్ని జగన్ రెడ్డికి చేరవేయడంతో మేకపాటి అతని పై సీరియస్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే విమర్శలు చేస్తున్నారు. ఇక ఆయన గ్రాఫ్ విషయానికి వస్తే.. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రజల్లో పట్టు కోల్పోయారు. పైగా ఆయన తీరు పై తీవ్ర వ్యతిరేకత ఉంది. కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇచ్చేది లేదని జగన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మేకపాటి వైసీపీ పార్టీని విడి ఆలోచనలో ఉన్నారు. టీడీపీ వైపు మేకపాటి చూపు ఉంది. ఐతే, మేకపాటికి మళ్లీ గెలిచే సత్తా లేదు.