బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్కు చాలా రుణపడి ఉన్నానని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. వీరిద్దరు కలిసి నటించిన చిత్రం ‘సైరా’. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిస్తున్న సినిమా ఇది. ఇందులో చిరంజీవి గురువుగా అమితాబ్ కనిపించనున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాని కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబరు 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సోమవారం ఈ చిత్రం టీజర్ను ముంబయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు. ‘సైరా’ ప్రచారంలో భాగంగా చరణ్, చిరు ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. అమితాబ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘అమితాబ్ మా వద్ద విమానం టికెట్ల డబ్బులు తీసుకోవడానికి నిరాకరించారు. మేం కూడా బలవంతం చేయలేకపోయాం’ అని చరణ్ అన్నారు.
అనంతరం చిరు మాట్లాడుతూ.. ‘అది నిజంగా గొప్ప విషయం. అమితాబ్ ప్రయాణించడం కోసం ప్రైవేటు జెట్ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. కానీ ఆయన దానికి కూడా ఒప్పుకోలేదు. ముంబయి నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్లో బస చేయడం గురించి అడిగా. ‘నేను ఇదంతా స్నేహం కోసం చేస్తున్నా’ అన్నారు. చాలా సంవత్సరాలుగా మా ఇద్దరికీ పరిచయం ఉంది. అలా అదృష్టవశాత్తు మా సినిమాలో ఆయన నటించేందుకు ఒప్పుకున్నారు. అమితాబ్ బచ్చన్కు రుణపడిపోయాను. ‘సైరా’ లో కోసం ఆయనకు ఫోన్ చేసి, పాత్ర గురించి చెప్పా. నాకు తెలుగు భాష రాదన్నారు. ‘ఫర్వాలేదు, మీకు ఏ భాష సౌకర్యవంతంగా అనిపిస్తుందో అదే భాషలో డైలాగ్లు చెప్పండి’ అని చెప్పా. దీంతో ఆయన వెంటనే ఒప్పుకున్నారు. నాకు తెలిసి అమితాబ్ ఇతర భాషలో చేసిన తొలి సినిమా ఇది’ అని పేర్కొన్నారు.