నేచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. టైటిల్ను ఓ ప్రత్యేక వీడియో ద్వారా విడుదల చేశారు. అయితే ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ను తమ మాణిక్యం మూవీస్ బ్యానర్ మీద తెలంగాణ, ఏపీ ఫిలిం ఛాంబర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చిత్ర నిర్మాత, హీరో మోహన కృష్ణ విలేకరుల సమావేశంలో చెప్పారు. తన అనుమతి లేకుండా మైత్రీ మూవీ మేకర్స్ టైటిల్ను ఎలా ప్రకటిస్తుందని ప్రశ్నించారు. మెగా హీరోకైతేనే టైటిల్ ఇస్తానని ఆయన అనడంతో వివాదం ముదిరింది.
ఈ సందర్భంగా మోహన కృష్ణ మాట్లాడుతూ.. ‘మా మాణిక్యం మూవీస్ బ్యానర్లో ‘బావా మరదలు’ అనే సినిమా నిర్మించాం. ఇప్పుడు ‘నాయుడు గారి అబ్బాయి’ నిర్మిస్తున్నాం. త్వరలోనే ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమా చేయబోతున్నాం. ఇందులో నేనే హీరోగా నటిస్తూ, నిర్మించబోతున్నా. గత ఏడాది అక్టోబర్లో ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాం. ఉగాది నుంచి తూర్పు గోదావరిలో దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ కు ప్లాన్ చేశాం. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. నేను చిరంజీవి గారికి వీరాభిమానిని’.
‘గ్యాంగ్ లీడర్’ టైటిల్తో ఏ మెగా హీరో సినిమా చేసినా ఇచ్చేస్తాను. వేరే వాళ్లకు ఇచ్చే ప్రసక్తి లేదు. టైటిల్ కావాలని మైత్రీ మూవీ మేకర్స్ నుంచి కాల్ చేశారు. కానీ నేను టైటిల్ ఇవ్వను, అమ్మను అని చెప్పాను. వాళ్లు చాలా రకాలుగా ప్రయత్నించారు. కానీ టైటిల్ మాకే దక్కింది. అయినప్పటికీ నాని పుట్టినరోజు మా టైటిల్తో పబ్లిసిటీ చేసుకున్నారు. నా అనుమతి తీసుకోకుండా ఎలా టైటిల్ను ప్రకటిస్తారు? ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకున్నారో తెలియదు. నేను ఛాంబర్లో ఫిర్యాదు చేశాను. ఈ టైటిల్ మాకే వచ్చింది. ఏపీ, తెలంగాణ ఛాంబర్స్ మాకే అనుకూలంగా ఉన్నాయి’.
‘రూ.3 కోట్ల బడ్జెట్తో సినిమా చేస్తున్నాం. చిరంజీవి గారి టైటిల్ పెట్టడం వల్ల చాలా ఫండింగ్ వచ్చింది. రూ.50 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా వచ్చింది. పక్కోడి టైటిల్ తీసుకోవడం సరికాదు. పెద్ద నిర్మాత అవ్వాలని చిత్ర పరిశ్రమకు వచ్చాను. చిరంజీవి గారి టైటిల్కు ఎటువంటి ఆటంకం లేకుండా మంచి పేరు తెచ్చుకోవాలని కథ రెడీ చేశాం. టైటిల్ విషయంలో చట్టబద్ధంగా మేం కరెక్ట్గా ఉన్నాం. తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సముద్ర, నట్టి కుమార్, ముత్యాల రాందాసు లాంటి పెద్దలు కూడా మాకు అండగా ఉన్నారు. ఏపీ ఎన్నికలు అయ్యాక.. 16 సినిమాలు తీసిన పెద్ద బ్యానర్తో కలిసి మా బ్యానర్లో సినిమాలు తీసి, యంగ్ టాలెంట్ని ప్రోత్సహించబోతున్నాం’ అని ఆయన అన్నారు.
మోహన కృష్ణ తీయబోతున్న ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో సినిమాలో సుమన్, నాగబాబు, తనికెళ్ల భరణి, ఎల్.బి.శ్రీరామ్, గీతా సింగ్, రంగస్థలం మహేష్ తదితరులు నటించబోతున్నారు.