జనసేన, వామపక్షాల సమావేశం శుక్రవారం విశాఖపట్నంలో జరగనుంది. సాయిప్రియా రిసార్ట్స్ లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఎన్నికల పొత్తులు, మేనిఫెస్టో, ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్లాలి.. తదితర అంశాలపై జనసేన అధ్యక్షడు పవన్ కల్యాణ్, ఆ పార్టీ మరో నేత నాదెండ్ల మనోహర్ లు వామపక్ష నేతలతో కలిసి చర్చిస్తారు. ఈ సమావేశానికి సీపీఐ జనరల్ సెక్రటరీ సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, ఇతర వామపక్ష నేతలు హజరుకానున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని.. వామపక్షాలు తప్ప ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తేలేదని స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. “వామపక్షాలతో తప్ప ఎవరితోనూ కలిసి వెళ్లం.. 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ. యువతకు, మహిళలకు అధిక ప్రాధాన్యం. అధికార, ప్రతిపక్షాల మాటలను ముక్తకంఠంతో ఖండించండి” అంటూ ఓ పోస్టర్ని కూడా ట్విట్టర్లో ఉంచారు.
ఈ నెల 26న రిపబ్లిక్డే పురస్కరించుకుని మంగళగిరి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. 27 మధ్యాహ్నం గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం ఎల్ఈఎం స్కూల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసగించనున్నారు.