ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి ఓ నిజం చెప్పారని, ఈ ఎన్నికల్లో ఓడిపోతే తాను విశ్రాంతి తీసుకుంటానని అన్నారని, అది నిజమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఎద్దేవా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన ఆర్మూర్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘నీళ్లు, నిధులు, నియామకం కోసం తెలంగాణ ఏర్పడింది. ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేరుస్తారని ఆశించాం. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కేసీఆర్ అంటే కావో కమీషన్రావు అని అర్థం. రాష్ట్ర సంపదను తన కుటుంబానికి వెచ్చిస్తున్నారు. రాష్ట్రంలో రూ.2.50లక్షల కోట్ల మేర అప్పులు చేశారు. ఒక్కో పౌరుడి పేరిట రూ.2.50లక్షల అప్పు ఉంది. ఆర్మూర్లో స్థానికంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. రైతులు పండించే పంటలకు మద్దతు ధర లభించడం లేదు. మద్దతు ధరలు అడిగే రైతులను కొట్టించారు. పంటలకు నీరు అడిగితే పోలీసులతో లాఠీఛార్జి చేయించారు. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదు. రైతుల అనుమతి లేకుండా భూములు తీసుకోవద్దని భూసేకరణ చట్టంలో ఉంది. ఆ చట్టాన్ని రద్దు చేసి రైతుల భూములను బలవంతంగా తీసుకున్నారు. కేసీఆర్, ఆయన కుమార్తె కవిత కూడా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ, అలా చేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సమస్యలు పరిష్కరిస్తాం.17రకాల పంటలకు మద్దతు ధర ఇస్తాం.’

‘గబ్బర్సింగ్ ట్యాక్స్ జీఎస్టీని సమీక్షిస్తాం. బీడీ కార్మికులు, యాజమాన్యాలపై జీఎస్టీ భారం లేకుండా చూస్తాం. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటానని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ గారూ మీరు విశ్రాంతి తీసుకునేది రూ.300కోట్ల భవంతిలో.. డబుల్ బెడ్రూమ్, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదు. 2లక్షల మంది డబుల్బెడ్ రూమ్ కట్టిస్తానని హామీ ఇచ్చారు. కనీసం 5వేల మందికి కూడా కట్టించలేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి రూ.100కోట్ల అవసరం ఉంటే, దాన్ని మూసేసి మీరు మాత్రం రూ.300కోట్లతో ఇల్లు కట్టుకున్నారు. ఎన్నికల తర్వాత విశ్రాంతి తీసుకుంటానని కేసీఆర్ నిజం చెప్పారు. జరిగేది అదే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గల్ఫ్ బాధితుల సమస్యలు పరిష్కరిస్తాం. రూ.500కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తాం.’ అని ప్రజలకు రాహుల్ హామీ ఇచ్చారు.













