తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు కోలీవుడ్ సీనియర్ నటుడు కార్తీక్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత కొంత కాలం క్రితమే తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడిన ఆయన.. ఆ తర్వాత కోలుకున్నారు. ఇటీవల తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. మరోసారి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. నటుడిగా వెండితెరపై చెరగని ముద్రవేసుకున్న కార్తీక్.. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి వచ్చారు. అంతేకాదు.. సొంతంగా పార్టీ కూడా పెట్టారు. అయితే.. అనారోగ్యం కారణంగా కొంతకాలానికే పార్టీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా.. ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం కూడా చేపట్టారు.
ఈ క్రమలోనే గత సోమవారం ఎన్నికల ప్రచారం ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో.. కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనను చేర్పించారు. కార్తీక్ శ్వాసకోస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. తాజాగా రక్తపోటుకూడా ఎక్కువైందని అందుకే అస్వస్థతకు లోనయ్యారని వైద్యులు చెప్పినట్టు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకూ ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉండడంతో అత్యవసర చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.