ప్రముఖ సినీ నటుడు, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారట. ఈ విషయాన్ని ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత జీకే రెడ్డి కోలీవుడ్ మీడియా వర్గాలతో చెప్పినట్లు తెలుస్తోంది. అనీశా అనే యువతితో విశాల్ వివాహం జరగబోతున్నట్లు పేర్కొన్నారు. త్వరలో హైదరాబాద్లో నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నారట. పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే నడిగర్ సంఘం కోసం కొత్త భవనాన్ని నిర్మించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని గతంలో విశాల్ శపథం చేశారట.
కాబట్టి ప్రస్తుతానికి నిశ్చితార్థ పనులు మొదలుపెట్టే పనిలో ఆయన కుటుంబీకులు ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. సినీ నటి వరలక్ష్మి శరత్కుమార్ను విశాల్ పెళ్లిచేసుకోబోతున్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికీ వీరి గురించి వదంతులు వస్తూనే ఉన్నాయి. దీనిపై ఇటీవల వరలక్ష్మి ట్విటర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. విశాల్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేశారు. తాను పెళ్లిచేసుకోవడంలేదని, ఇలాంటి వార్తలు ఎవరు సృష్టిస్తున్నారో తనకు తెలుసని హెచ్చరించారు.