ఆర్టీసీ కార్మికుల సెప్టెంబరు నెల జీతాల చెల్లింపు విషయంపై సోమవారం హై కోర్టులో విచారణ జరిగింది. టీఎస్ ఆర్టీసీ వద్ద ప్రస్తుతం ఏడున్నర కోట్ల రూపాయలు మాత్రమే ఉందని, సెప్టెంబరు నెల కార్మికుల జీతాలు చెల్లించాలంటే రూ.224 కోట్లు అవసరం అవుతుందని అడ్వకేట్ జనరల్ హై కోర్టుకు విన్నవించారు. సమ్మె కారణంగా సెప్టెంబరు నెల జీతాలను సంస్ధ కార్మికులకు చెల్లించలేదు. ఈవిషయంపై తదుపరి విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేసింది కోర్టు.
ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లింపునకు కావాల్సిన నగదు లేదన్న ప్రభుత్వ వాదన వినిపించింది. ఈ వైఖరితో జీతాలు చెల్లింపు మరింత ఆలస్యం కానుంది. రెండు వారాలుగా నడుస్తున్న సమ్మెతో మరింత నష్టాలు వచ్చాయన్నారు. విచారణ మధ్యాహ్నం 2 గంటల తర్వాత మళ్లీ వాదనలు విననుంది హైకోర్టు. ప్రభుత్వ వాదనపై కార్మిక సంఘాల తరపున పిటీషనర్ వాదనలు కూడా వినిపించారు. జీతాలు చెల్లించకపోవటంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని.. వారికి రావాల్సిన బకాయిలు వెంటనే ఇవ్వాలని వాదించారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. ప్రభుత్వం చెబుతున్నట్లు 224 కోట్ల రూపాయలు అవసరం లేదని.. కేవలం 110 కోట్లు ఉంటే కార్మికుల జీతాలకు సరిపోతాయన్నారు పిటీషనర్ తరపు న్యాయవాది.