నేడు మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. నేనే సామాన్య మానవుడిని అయితే జగన్ ను శ్రీకాకుళంలో అడుగుపెట్టనిచ్చేవాడిని కాదు. జైలుకెళ్లయినా జగన్ పాదయాత్రను ఒక్కరోజైనా అడ్డుకునేవాడినన్నారు. ఆడవాళ్లకు ముద్దులు పెట్టడానికే వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్నారు. ముద్దులు పెట్టుకోవడానికి కూడా ముందే జాబితా రెడీ చేసుకుంటారు. జాబితాలో ఉన్నవాళ్లకు ముందురోజే షాంపులు ఇచ్చి.. తలస్నానం చేయించి.. తర్వాత రోజు పాదయాత్రలో ముద్దులు పెడతాడని ఆయన ఆరోపించారు. ఏడాది కాలం పాటు పాదయాత్ర చేసిన జగన్.. ఒక్కచోటైనా టెంటు వేసి సభ పెట్టారా? ఇరుకు రోడ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో సభలు పెడతారని మంత్రి విమర్శించారు.
పాదయాత్రకు ఓ పవిత్రత ఉండాలి. జగన్ పాదయాత్రకు విలువలేదు. రోజుకి 8 గంటలు.. వారానికి 4 రోజులు నడవడం కూడా పాదయాత్రేనా? అని మంత్రి ప్రశ్నించారు. అవినీతి చక్రవర్తి పేరిట చంద్రబాబుపై పుస్తకం విడుదల చేయడం సిగ్గుచేటు. అసలు వైఎస్ జగన్ కు ఏం అర్హత ఉంది. రాష్ట్రంలో జగనే అతిపెద్ద అవినీతి చక్రవర్తి అని మండిపడ్డారు. బీజేపీ నుంచి టీడీపీ బయటికి వచ్చిన తర్వాత జగన్ ప్రత్యేకహోదాపై ఎందుకు మాట్లాడలేదు? అని నిలదీశారు. టీడీపీ ప్రభుత్వ కార్యక్రమాలను కార్యకర్తలే ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీని చూసే ప్రజలు మనకు గౌరవం ఇస్తున్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను పూర్తిచేసిన ఏకైక పార్టీ టీడీపీ. సంక్షేమం, అభివృద్ధితోనే ప్రజల ముందుకు ఓట్లు అడగడానికి వెళ్తాం అని మంత్రి తెలిపారు.