Homeపొలిటికల్YS Sharmila: ఏపీలో ప్రజల భూములన్నీ ఇక సర్కారు చేతిలోనే:షర్మిల

YS Sharmila: ఏపీలో ప్రజల భూములన్నీ ఇక సర్కారు చేతిలోనే:షర్మిల

sharmila comments

YS Sharmila: వైఎస్ షర్మిల మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఏపీలో కొత్తగా తీసుకొస్తున్న భూహక్కుచట్టంపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ చట్టం గనుక అమల్లోకి వస్తే ప్రభుత్వమే భూకబ్జాలు చేస్తుందని ఆరోపించింది. ఇప్పుడు ఏపీలో లిక్కర్ వ్యాపారం ప్రభుత్వమే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే భూకబ్జాలను కూడా ప్రభుత్వమే చేస్తుందని దుయ్యబట్టారు.

కొత్త భూహక్కు చట్టం అమల్లోకి వస్తే పేద ప్రజల ఆస్తులు సర్కారు చేతుల్లోకి వెళ్లిపోతాయని అన్నారు. పేదలు తమ భూములను తన పిల్లలకు రాసివ్వాలన్నా ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికే లిక్కర్ వ్యాపారం ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకుని ఏ లిక్కర్ ఎంతకు అమ్మాలో సర్కారే నిర్ణయిస్తుందని, ఇతర రాష్ట్రాల్లో అమ్ముతున్న మద్యం ఇక్కడ అమ్ముతున్నా రెట్టింపు ధరలకు కొనాల్సి వస్తుందని అన్నారు.

ఏపీలో లిక్కర్ మాఫియా తయారైందని, అది కూడా నాణ్యమైన మద్యం అమ్మడం లేదని ఆరోపించారు. ఏపీలో మద్యం తాగి ఇతర రాష్ట్రాలకంటే 25 శాతం ఎక్కువమంది లివర్ వ్యాధితో చనిపోతున్నారని ఓ సర్వేలో తేలిందని షర్మిల అన్నారు. లిక్కర్ వ్యాపారాన్ని సర్కారు ఎలా తన గుప్పిట్లో పెట్టుకుందో ఇప్పుడు పేదల భూములను కూడా సర్కారు తన గుప్పిట్లో పెట్టుకుంటుందని మండిపడ్డారు. మీ భూమిని మీరు తాకట్టు పెట్టుకునే అధికారం కూడా ఉండదని ఆరోపించారు. అలాంటి సర్కారు మీకు అవసరమో లేదో ప్రజలు తేల్చుకోవాలని అన్నారు.

ఎన్నికలకు ముందు డీఎస్సీ పేరుతో జగనన్న మోసం చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అని ఎద్దేవా చేశారు. ఇది ఎలక్షన్ స్టంట్ కాకపోతే ఏమిటో ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే భవిష్యత్తు తరాలు బాగుపడతాయని షర్మిల అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత నాది అని షర్మిల గట్టిగా చెప్పారు.

జగన్ కూడా గత ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా తెస్తానని వాగ్దానంతో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత దాని సంగతే మర్చిపోయారు. కేంద్రం కూడా దీనిపై ఏమీ చేయలేమని చెప్పేసింది. ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. అందుకే టీడీపీ ప్రభుత్వం ఉండగానే ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం తేల్చిచెప్పింది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏపీకి తప్పక ప్రత్యేక హోదా ఇస్తామని షర్మిల ఇప్పుడు హామీ ఇస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu