తెలంగాణ పోలీసులు దాడులు చేసింది, కుట్రను బయటప ఎట్టింది ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ విషయంలో. అది ఏపీ ప్రజలకు సంబంధించిన డాటాను చోరీ చేసిందని, ఆ డాటాను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీకి సాయం చేస్తోందని, తెలుగుదేశం పార్టీ వ్యతిరేక వర్గం వారు ఎవరు అనే విషయం గురించి సర్వేలు చేసి.. ఓటర్ల జాబితాను గల్లంతు చేస్తోందని.. తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ఓట్లనే లేకుండా చేయడం వీరి పని అని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు కేసులు నమోదు చేశారు.
దీనిపై విచారణకు సిట్ కూడా ఏర్పాటు అయ్యింది. మరి ఇప్పుడు స్పందించాల్సింది ఎవరు? ఐటీ గ్రిడ్స్ సంస్థ స్పందించాలి. తాము చేసిన పని ఏమిటో.. తమపై మోపిన అభియోగాల పరిస్థితి ఏమిటో ఆ సంస్థ చెప్పాలి. తాము నిర్దోషులమనో .. తెలీయక చేశామనో.. ఏదో ఒకటి చెప్పుకోవాలి. తమకు డాటా ఎలా వచ్చిందో వివరించాలి. అదంతా ఐటీ గ్రిడ్స్ అనే ఆ సంస్థ పని. అయితే.. దాని ఓనర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదై నాలుగైదు రోజులు అవుతున్నా.. అతడి జాడ లేదు. అతడు ఎక్కడ దాక్కొన్నాడో తెలియడం లేదు. ఈ అంశంపై కూడా సిట్ అధికారులు దృష్టి సారించారు.
అశోక్ ను పట్టుకోవడానికి సిట్ లో కొందరు ప్రత్యేకంగా నియమితులు అయ్యారు. అతడి జాడను గుర్తించడానికి వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. అతడు దొరికితే అసలు కథ బయటకు వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఇదీ పరిస్థితి.
మరి ఈ పరిస్థితుల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడటం విడ్డూరంగా మారింది. చంద్రబాబు నాయుడు డాటా గ్రిడ్స్ సంస్థ తరఫున వకాల్తా పుచ్చుకున్నారు. తీవ్రమైన అభియోగాలు మోపబడని సంస్థ విషయంలో బాబు మాట్లాడారు. మాట్లాడాల్సిన అశోక్ ఏమో జాడ లేదు. అతడి తరఫున చంద్రబాబు నాయుడు వకాల్తా పుచ్చుకున్నారు. గజ్జికి లేని దురద జాలీమ్ లోషన్ కు ఎందుకు? అన్నట్టుగా.. చంద్రబాబు ఇంతలా రియాక్ట్ అయిపోవడం ఎందుకో!