సినీ నటుడు నర్సింగ్ యాదవ్ (52) కన్నుమూశారు. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సింగ్ యాదవ్ గురువారం రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. నర్సింగ్ యాదవ్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 300లకు పైగా చిత్రాల్లో నటించారు. కామెడీ, విలన్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. నర్సింగ్ అసలు పేరు మైలా నరసింహ యాదవ్. ఇండస్ట్రీలో ఆయన్ను నర్సింగ్ యాదవ్ అని పిలుస్తారు. ఆయనకు భార్య చిత్ర, కొడుకు రిత్విక్ యాదవ్ ఉన్నారు. నర్సింగ్ యాదవ్ కామెడీ విలన్గా, విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 1963 మే 15న హైదరాబాద్లో జన్మించారు.
విజయనిర్మల దర్శకత్వం వహించిన హేమాహేమీలు చిత్రంతో సినిమాల్లోకి వచ్చారు. రామ్గోపాల్ వర్మ చిత్రం క్షణంక్షణంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ముఠామేస్త్రీ, మాస్, శంకర్ దాదా ఎంబీబీయస్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రేసుగుర్రం, పిల్లజమిందార్, సుడిగాడు, కిక్ తదితర చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలకు మంచి పేరు వచ్చింది. చిరంజీవి చిత్రం ఖైదీనెంబర్ 150లోనూ నర్సింగ్ నటించారు. గత కొంతకాలంగా నర్సింగ్ యాదవ్కు డయాలసిస్ జరుగుతోంది. నర్సింగ్ యాదవ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.