రాజధాని అమరావతి గురించి వైసీపీ అధినేత జగన్ కనీసం ప్రచారానికి చివరిరోజైనా ఒక్క మాటా మాట్లాడలేదని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్నిక ప్రచారంలో బాబు చివరి రోడ్షో తాడికొండలో జరిగింది. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఉండడం జగన్ కు ఇష్టం లేదని, గెలిస్తే రాజధానిని మార్చేస్తానంటున్నారని మండిపడ్డారు. అమరావతిలో రైతులు భూములిస్తే ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ మూర్ఖత్వానికి ఓ హద్దు ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ ప్రత్యేక హోదాకు కేసీఆర్ నిన్న మద్దతు ప్రకటించడంపై బాబు స్పందిస్తూ.. తెలంగాణ ఎన్నికల్లో ఇదే విషయంలో ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడారని ప్రశ్నించారు. పోలవరంపై సుప్రీంకోర్టులో కేసులేశారని బాబు విమర్శించారు. తెలంగాణలో తాను ప్రచారం చేస్తే మీకేం పని ప్రశ్నించిన కేసీఆర్కు ఏపీలో ఇప్పుడేం పని అని నిలదీశారు.
ఇక.. కేసీఆర్-జగన్ మధ్య రూ.1000 కోట్లతో ఒప్పందం కుదిరిందని బాబు ఆరోపించారు. రూ.1000 కోట్లు ఇచ్చినందుకుగానూ రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టబోతున్నారని అన్నారు. తాను అధికారంలో ఉంటే వచ్చే ఐదేళ్లలో అమరావతి గొప్పగా ఎదిగిపోతుందని, హైదరాబాద్ గ్రాఫ్ పడిపోతుందని భయపడుతున్నారని.. అటువంటివారికి జగన్ సహకరిస్తున్నారని అన్నారు. ‘ఈ ఐదేళ్లూ ఎవరికీ ఇబ్బంది లేకుండా పాలన సాగించాను. ఈ ఎన్నికల ప్రచారంలో ఇదే నా చివరి సభ. మీ ఆశీస్సులు కావాలి’ అని కోరారు.