మరో ‘జబర్దస్త్’ కమెడియన్ ధన్ రాజ్ దర్శకుడిగా మారబోతున్నాడు. ఆయన చాలానే సినిమాల్లో నటించినప్పటికీ.. ‘జబర్ధస్త్’ తోనే అయితే గుర్తింపు వచ్చింది. ఈ మధ్య కాలంలో తనకి వేషాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఆయన మెగా ఫోన్ పట్టనున్నాడనే టాక్ వినిపిస్తోంది.
ధన్ రాజ్ ఒక కథను రెడీ చేసుకుని, ‘విమానం’ షూటింగు సమయంలో సముద్రఖనికి చెప్పాడట. ఆయనకి కథ నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నాడని అంటున్నారు. కథ అంతా ఆయన పాత్ర చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. దసరాకి ఈ సినిమా షూటింగును లాంఛనంగా మొదలుపెడతారని అంటున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతుందని చెబుతున్నారు.
ఇటీవలే కమెడియన్ గా వేణు కూడా ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మారిపోయాడు. ఈ సినిమా పెద్ద సంచలనమే సృష్టించింది. నిర్మాతలకు పదింతలు లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు వేణు బాటలోనే అడుగులు వేయబోతున్నాడు ధన్రాజ్