టాలీవుడ్ ప్రముఖ నటుడు వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మెహరీన్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘f2’. ‘అంతేగా.. అంతేగా’ ఈ ఒక్క డైలాగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్లకు పైనే వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయబోతున్నారు ప్రముఖ నిర్మాత బోనీ కపూర్. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. ‘బోనీ కపూర్, దిల్రాజు సంయుక్తంగా ‘f2′ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. హిందీ రీమేక్కు అనీస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తారు’ అని పేర్కొన్నారు. ‘f2’ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. హిందీలో ఎవరు జంటగా నటిస్తారో, టైటిల్ ఏమని పెడతారో వేచి చూడాలి. ఈ మధ్యకాలంలో బోనీ కపూర్ ఎక్కువగా రీమేక్లపై దృష్టిసారిస్తున్నారు. తన భార్య, దివంగత నటి శ్రీదేవి కోరిక మేరకు అజిత్తో ‘పింక్’ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నారు. 2020లోనూ అజిత్తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరోపక్క దక్షిణాదిన బ్లాక్బస్టర్ విజయాలు అందుకున్న ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాలు బాలీవుడ్లో రీమేక్ అవుతున్నాయి.
IT'S OFFICIAL… Boney Kapoor and Dil Raju [leading producer of #Telugu films] join hands for the official #Hindi remake of #Telugu hit #F2… #Hindi film will be directed by Anees Bazmee… #F2 stars Venkatesh, Varun Tej, Tamannaah and Mehreen Pirzada.
— taran adarsh (@taran_adarsh) March 29, 2019