భిక్షాటన చేస్తూ ఆకస్మికంగా మరణిస్తున్న వ్యక్తుల దగ్గర అధిక మొత్తంలో నగదు బయటపడుతున్న సంఘటనలు ఇటీవల ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం తమిళనాడులో భిక్షాటన చేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ వ్యక్తి వద్ద రూ.1.86 కోట్లకుపైగా నగదు లభ్యమైనది. అరవన్నామలై ప్రాంతంలో గత గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భిక్షకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని, అతని దగ్గర ఉన్న సంచిని పరిశీలించగా అందులో రూ.1,86,43,364 నగదు బయటపడింది.
మొన్న ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతూ మరణించిన ఓ వృద్ధ సాధువు జోలె సంచిలో రూ.లక్షా 80 వేల నగదు లభ్యమైనది.
తాజాగా తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలోని ముక్తిలింగవారి వీధిలో భిక్షాటన చేస్తున్న అప్పల సుబ్రహ్మణ్యం (75) అనే వృద్ధుడు మరణించాడు. 30ఏళ్ళు గుడిలో పౌరహిత్యం చేసిన సుబ్రహ్మణ్యం వృధ్యాప్యంలో శరీరం సహకరించకపోవడంతో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందాడు. కుటుంబసభ్యులు వచ్చి దహన కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం ఇంట్లో సంచులను వెతగ్గా అందులో సుమారు రూ.7 లక్షల వరకూ ఉన్నట్లు గుర్తించారు. సుబ్రహ్మణ్యం సంచిలో లభించిన నగదును లెక్కిస్తున్న ఫోటో ఓ దేవాలయ హుండీని లెక్కిస్తున్న దృశ్యంలా తలపిస్తోంది. అయితే ఈ డబ్బును భిక్షాటన చేస్తూ కూడబెట్టాడా? లేదా పౌరోహిత్యం సమయంలో సంపాదించాడా అని తెలియరావడం లేదు.