ఉత్తరప్రదేశ్ రామ్పూర్ నుంచి పోటీ చేస్తున్న సినీ నటి జయప్రద కన్నీటి పర్యంతమయ్యారు. బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం రామ్పూర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. ‘సమాజ్వాదీ పార్టీకి చెందిన ఆజం ఖాన్ మూలాన నేను రామ్పూర్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. అతను నా మీద యాసిడ్ పోస్తానని బెదిరించాడు’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. అది చూసి చలించిన జనాలు.. ‘బాధపడకండి.. మేం అంతా మీకు తోడుగా ఉంటాం’ అని ఆమెను ఓదార్చారు. తర్వాత తనను తాను సముదాయించుకున్నారు జయప్రద. ఆ తర్వాత ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘కానీ తొలిసారి ఈ రోజు నేను చాలా ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే నా వెనక బీజేపీ ఉంది. గతంలో నేనేప్పుడు ఇలా ఏడ్వలేదు. నాకు బతికే హక్కు ఉంది.. జీవిస్తాను మీకు సేవ చేస్తాను. మహిళలకు రక్షణ, గౌరవం లభించే పార్టీలో చేరినందుకు నాకు చాలా గర్వంగా ఉంద’ ని తెలిపారు. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా జయప్రద 2004, 2009లో రాంపూర్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. కాగా 2014లో రాష్ట్రీయ లోక్ దళ్ అభ్యర్థిగా బిజ్నోర్ నుంచి పోటీచేసి ఓడిపోయారు.