టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరి కిషన్ (57) కన్నుమూసారు. ఆయన గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. ఆయన శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈయన తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్తో పాటు ఇప్పటి తరం హీరోలైన ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వరకు అందరి హీరోల గొంతులను అనుకరించి మైమరిపించారు. అంతేకాదు ఈయన తెలుగు రాష్ట్రాల్లో అప్పటి ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్, వైయస్ఆర్ వంటి రాజకీయ నాయకుల గొంతులు సైతం మిమిక్రీ చేసి శభాష్ అనిపించారు.
ఈయన మే 30, 1963 తేదీన శ్రీమతి రంగమణి, V.L.N.చార్యులు దంపతులకు ఏలూరులో జన్మించారు. అంతేకాదు చిన్నప్పటడే 8 ఏళ్ల వయసులోనే తన గురువులను తోటి వాళ్ల గొంతులను మిమిక్రీ చేయడాన్ని ప్రారంభించారు. అలా ప్రారంభమైన హరికిషన్ మిమిక్రీ ప్రస్థానం… ఆ తర్వాత సినీ నటులు, గాయకులు, క్రికెట్ కళాకారులు, రాజకీయ నాయకుల గొంతులను అనుకరిస్తూ పాపులర్ అయ్యారు. అంతేకాదు మిమిక్రీలో తన కంటూ ప్రత్యేక పేజీలు రాసుకున్నారు. కేవలం మిమిక్రీ మాత్రమే కాదు పశు పక్ష్యాదుల శబ్ధాలతో పాటు యంత్రాలు చేసే శబ్ధాలు.. సంగీత వాద్య పరికరాల సౌండ్స్ను తన గొంతులో పలకించడం హరి కిషన్ ప్రత్యేకత. 1971లో తొలిసారి విజయవాడలో మిమిక్రీ ప్రదర్శన చేసారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. మిమిక్రీ కళాకారుడిగా దేశ విదేశాల్లో వేలాది ప్రదర్శనలతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. ప్రముఖ నటుడు శివారెడ్డికి ఈయన గురువు కూడా. ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.