యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి టాక్తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ చిత్రం అందించిన విజయంతో ఆనందంలో ఉన్న నితిన్ తాజాగా హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా సూపర్ సక్సెస్ అయిన ‘అంధాధున్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ రోజు ఈ సినిమాకు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శ్యాంప్రసాద్ రెడ్డి, సూర్యదేవర రాధాకృష్ణ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా ఈ పూజా కార్యక్రమంలో మెరిసారు.
దేవుని పటాలపై ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా.. నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచ్ఛాన్ చేస్తే.. సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. మరో నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ.. సినిమా స్క్రిప్ట్ను దర్శకుడు మేర్లపాక గాంధీకి అందచేసారు. ఈ చిత్రంలో నటించే చేసే మిగతా నటీనటులను త్వరలో ఎంపిక చేయనున్నారు. హిందీలో కథలో కీలకంగా ఉన్న టబు పాత్రను తెలుగులో అనసూయను తీసుకోవాలి అనుకుంటున్నారట.