దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా దాదాపు 47 రోజులపాటు ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. బస్సులు, రైళ్లు, విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నెమ్మదిగా కేంద్రం ఒక్కో సడలింపులు ఇస్తున్న నేపథ్ంలో తాజాగా ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు అనుమతి నిచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్త లాక్డౌన్ ఈ నెల 17 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గూడ్స్ రైళ్లు, వలస కార్మికులను తరలిస్తున్న శ్రామిక్ ప్రత్యేక రైళ్లు మాత్రమే ఇప్పటివరకూ రాకపోకలు సాగిస్తున్నాయి. మే 12 నుంచి దశలవారీగా ప్యాసింజర్ రైళ్ల సేవలను పునరుద్ధరించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
ప్రస్తుతానికి ఢిల్లీ నుంచి 15 రూట్లలో రాకపోకలకు 30 రైళ్లు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణం చేయాలనుకునేవారికి మే 11, సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్లో టికెట్లు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్ నిర్వహించి కరోనా లక్షణాలు లేవని తేలితేనే రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిస్తామని రైల్వే శాఖ తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది.