తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి చూపు ప్రత్యేకంగా కొడంగల్ వైపై ఉంది. ఎన్నికలు ఉత్కంఠ భరితంగా కొనసాగడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడా లేని విధంగా కొడంగల్లో పలు సంఘటనలు జరిగాయి. దీంతో గెలుపోటములు ఎవరిని వరిస్తాయోనని ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తున్న రేవంత్రెడ్డి, నరేందర్రెడ్డి మధ్య ఉత్కంఠ భరితంగా కొనసాగిన పోలింగ్ సరళిని నియోజకవర్గంతో పాటు రాష్ట్ర నాయకులూ అంచనా వేస్తున్నారు.
ఓ పక్క రేవంత్రెడ్డి వర్గం 20వేల మెజార్టీతో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తుంటే.. నరేందర్రెడ్డి వర్గం తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు గెలుపోటములపై అంచనాలు వేసుకుంటూ కార్యకర్తలు, నాయకుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. దీంతో రేవంత్రెడ్డి, నరేందర్రెడ్డి అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు వేలల్లో బెట్టింగ్ చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు వరుసగా 3 సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించలేదు. గతంలో గురునాథ్రెడ్డి రెండు పర్యాయాలు గెలిచినా హ్యట్రిక్ సాధించలేకపోయారు. రేవంత్రెడ్డి 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. ప్రస్తుతం మూడోసారి కాంగ్రెస్ తరపున బరిలో దిగి హ్యాట్రిక్ సాధిస్తారనే ధీమాతో ఉన్నారు. ఏది ఏమైనా ఈవీఎంలలో దాగి ఉన్న అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలనుంది.
మరోవైపు కొడంగల్ నడిబొడ్డున కేటీఆర్ విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నానంటూ రేవంత్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. కొడంగల్లో తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని, మరి నేను గెలిస్తే కేటీఆర్ కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని కేటీఆర్కు సవాల్ విసిరారు. నేను గెలుపు పత్రం స్వీకరించిన మరుక్షణమే కేటీఆర్ రాజకీయ సన్యాసం ప్రకటన చేయాలని లేకుంటే కేటీఆర్ది కల్వకుంట్ల వంశమే కాదని తెలంగాణ సమాజం భావించాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు.