ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంలేదంటూ టీడీపీ మరోసారి నిరసనకు దిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సభ నుంచి వాకౌట్ చేశారు. మంగళవారం సభ ప్రారంభం నుంచే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడంపై పెద్ద దుమారం చెలరేగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ సభ్యులంతా నినాదాలు చేశారు. దీంతో టీడీఎల్పీ ఉపనేత రామానాయుడుని మార్షల్స్ బయటకు తీసుకెళ్లిపోయారు. అనంతరం అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, రామానాయుడిపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని టీడీపీ సభ్యులు ఉపసభాపతిని కోరారు. ఈ విషయాన్ని ఆయన అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లగా.. సీఎంతో చర్చించిన తర్వాత తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో మంగళవారం టీడీపీ సభ్యులు వాకౌట్ చేయడం చర్చనీయాంశమైంది.