టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు సారథి(83) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు (సోమవారం) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణావార్తలో టాలీవుడ్లో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి పలువురు తెలుగు సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
1960లో సీతారామ కళ్యాణంతో వెండితెరకు పరిచయమైన ఆయన హాస్య నటుడిగా దాదాపు 372పైగా చిత్రాల్లో నటించారు. అందులో సీతారామ కళ్యాణం, పరమానందయ్య శిష్యుల కథ, భక్త కన్నప్ప, జగన్మోహిని, మన ఊరి పాండవులు, డ్రైవర్ రాముడు వంటి మరెన్నో చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. అంతేకాదు తెలుగు చిత్రపరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా ఉన్నారు.
సారధి గారు.. ధర్మాత్ముడు ,అగ్గిరాజు, శ్రీరామచంద్రుడు చిత్రాలకు నిర్మతగా వ్యవహరించారు. నవతా కృష్ణంరాజు గారు నిర్మించిన జమిందార్ గారి అమ్మాయి, పంతులమ్మ, అమెరికా అమ్మాయి, ఇంటింటి రామాయణం, ఓఇంటి భాగోతం చిత్రాల మ్యూజిక్ సిట్టింగ్స్ అన్ని సారధి గారే చూశారు. రెబల్ స్టార్ కృష్ణంరాజుతో ఉన్న సాన్నిహిత్యంతో గోపికృష్ణ బ్యానర్లో నిర్మించిన చిత్రాలకు ఆయన సాంకేతికంగా చూసుకునేవారు. చిత్రపురి కాలనీ నిర్మాణంలో సారథి గారు కీలక పాత్ర పోషించారు.