కోలీవుడ్ నటుడు విశాల్, లక్ష్మీ మీనన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై విశాల్ స్పందించాడు. నటి లక్ష్మీ మీనన్ను తాను వివాహం చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియా కోడై కూస్తుండడంపై ఆయన కొట్టిపడేశాడు. ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని తెల్చిచెప్పేశాడు. ఈ రూమర్లలో ఓ అమ్మాయి గురించి ప్రస్తావన ఉంది కాబట్టే స్పందించానని, లేదంటే ఆయన స్పందించే వాడిని కాదు అని స్పష్టం చేశాడు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ పోస్టు చేశాడు.
‘సాధారణంగా నేను నా గురించి ఎలాంటి ఫేక్ న్యూస్ లేదా రూమర్స్ కి స్పందించను. ఎందుకంటే అది అనవసరమని నాకు తెలుసు. అయితే, లక్ష్మీ మీనన్తో నా వివాహంపై రూమర్లు వస్తుండడంతో స్పందించాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ విషయంలో ఓ అమ్మాయి ప్రస్తావన ఉంది కాబట్టి.
ఆమె ఒక నటి కాబట్టి. ఒక అమ్మాయి వ్యక్తిగత జీవితం, ఆమె ఇమేజ్ను దెబ్బతీస్తున్నారు. నేను ఎవరిని పెళ్లాడబోతున్నాను? సంవత్సరం, తేదీని డీకోడ్ చేయడానికి ఇదేమీ బెర్ముడా ట్రయాంగిల్ కాదు. సమయం వచ్చినప్పుడు ఆ సంగతేదో నేనే చెబుతాను”. అని అందులో రాసుకొచ్చాడు.