Ys Jagan: ఏపీ సీఎం జగన్ ఈ రోజు తిరుపతి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించారు. 8వ రోజు యాత్రకు కూడా జనలు పోటెత్తారు. గురవరాజుపల్లెలో సీఎం జగన్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. తరలివచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదలారు జగన్. ఈ సందర్భంగా మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మల్లవరం మీదుగా ఏర్పేడు బయల్దేరింది బస్సుయాత్ర. తనను కలిసి ఫోటో దిగేందుకు పరిగెట్టి వస్తున్న అభిమానిని పిలిచి జగన్ సెల్ఫీ ఇచ్చారు. ఏర్పాడు మండలం ఇసుక తాగేలివద్ద మహిళలతో మాట్లాడారు. అనంతరం ఏర్పేడు చేరుకున్న యాత్రకు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఎద్దుల చెరువు వద్ద సీఎం జగన్ సమక్షంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి వైసీపీలో చేరారు. ఆయనతో పాటు అనుచరులు, టీడీపీ కార్యకర్తలు వైసీపీ కండువా కప్పుకున్నారు. 2019లో నెల్లూరుజిల్లా కావలి నుంచి టీడీపీ తరపున పోటీ చేశారు విష్ణువర్ధన్రెడ్డి. పనగల్లు మీదుగా శ్రీకాళహస్తి బైపాస్కు వైసీపీ శ్రేణులు భారీ స్వాగతం పలికాయి. చిన్న సింగమల సమీపంలో లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో ముఖముఖిలో పాల్గొన్నారు జగన్.
ఈ సందర్భంగా ఆయన అనంతపురం జిల్లా శింగనమల వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్ చదివాడని, చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోవడంతో టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని సీఎం జగన్ వెల్లడించారు. ఒక సాధారణ టిప్పర్ డ్రైవర్ ను చట్టసభకు పంపించేందుకు తాము టికెట్ ఇచ్చామని, దీనిపై టీడీపీ నేతలు అవహేళన చేస్తున్నారని తెలిపారు.
ఇదే అంశంపై సీఎం జగన్ సోషల్ మీడియాలోనూ స్పందించారు. “జగన్ ఒక టిప్పర్ డ్రైవర్ కు సీటిచ్చాడని చంద్రబాబు అవహేళన చేశాడు. అంతటితో ఆగకుండా… వేలిముద్రగాడంటూ వీరాంజనేయులును అవమానించాడు. చంద్రబాబూ… నువ్వు కోట్లకు కోట్లు డబ్బులు ఉన్న పెత్తందార్లకు టికెట్లు ఇచ్చావు. నేను ఒక పేదవాడికి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం చేస్తున్నా… నాకు, నీకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబూ!” అంటూ ట్వీట్ చేశారు.