పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం బోయగూడెంలో ఏర్పాటు చేసిన గ్రామదర్శిని కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా యువతకు నిరుద్యోగ భృతి ఇస్తున్నామన్నారు. రాజధాని నిర్మాణం కష్టంతో కూడుకున్న పని.. కేంద్రంలో బిజేపీ సహకరించకపోయినా అద్భుత రాజధాని నిర్మిస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఆర్థికాభివృద్ధికి అన్ని కార్యక్రమాలు సక్రమంగా అమలు చేస్తున్నాం. కాపులకు కార్పొరేషన్ తీసుకొచ్చి వారికి అండగా నిలిచాం. కాపు రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. బీసీలు టీడీపీ వెన్నెముక, వారి అభివృద్ధికి టీడీపీ కృషి చేస్తుందని అన్నారు. పథకాల అమలులో పాదర్శకత తీసుకొచ్చాం. అన్ని పథకాల అమలుకు బయో మెట్రిక్ తెచ్చాం. ప్రజల్లో సంతృప్తి శాతం మరింత పెంచేందుకు కృషిచేస్తాం. దళారీ వ్యవస్థ లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, జవహర్, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.